అక్షరటుడే, వెబ్డెస్క్ : Stock Market | అమెరికా భారత్ పై విధించిన 25 శాతం సుంకాలతో ఉదయం మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమైనా తర్వాత కోలుకున్నాయి. మధ్యాహ్నం లాభాల బాట పట్టినా చివరికి నష్టాలతో ముగిశాయి.
వాణిజ్య ఒప్పందం విషయంలో భారత్పై ఒత్తిడి పెంచేందుకు యూఎస్ 25 శాతం టారిఫ్స్(Tariffs) విధించింది. దీంతో మన మార్కెట్లు గురువారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ ఎక్కువగా అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. అయితే కొద్దిసేపటికే తేరుకుని ఇంట్రాడే కనిష్టాలనుంచి సెన్సెక్స్ 11 వందల పాయింట్లకుపైగా పెరగడం గమనార్హం. చర్చల అనంతరం సుంకాలను తగ్గవచ్చన్న అంచనాలతో మార్కెట్లు కోలుకున్నాయి. ఐసీఐసీఐ, ఐటీసీ, హెచ్యూఎల్ వంటి స్టాక్స్ రాణించడంతో సూచీలు పెరిగాయి. ఉదయం సెన్సెక్స్(Sensex) 786 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా క్రమంగా కోలుకుంది.
ఇంట్రాడే కనిష్టాలనుంచి సెన్సెక్స్ 1,108 పాయింట్లు పెరిగింది. 213 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన నిఫ్టీ.. తర్వాత పుంజుకుని 321 పాయింట్లు లాభపడింది. చివరి గంటన్నరలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు తిరిగి నష్టాల బాటపట్టాయి. చివరికి సెన్సెక్స్ 296 పాయింట్ల నష్టంతో 81,185 వద్ద, నిఫ్టీ (Nifty) 86 పాయింట్ల నష్టంతో 24,768 వద్ద స్థిరపడ్డాయి. గురువారం రూపాయి(Rupee) విలువ మరింత బలహీనపడింది. డాలర్తో పోల్చితే 18 పైసలు తగ్గి 87.60 వద్ద ముగిసింది. మన కరెన్సీ బలహీనపడడం వల్ల విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. దిగుమతి వ్యయాలు పెరిగి ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,602 కంపెనీలు లాభపడగా 2,416 స్టాక్స్ నష్టపోయాయి. 135 కంపెనీలు ఫ్లాట్గా ముగిశాయి. 131 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 91 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 5 కంపెనీలు అప్పర్ సర్క్యూట్ను, 6 కంపెనీలు లోయర్ సర్క్యూట్ను తాకాయి. బీఎస్ఈ(BSE)లో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 3.6 లక్షల కోట్లు తగ్గింది.
ఎఫ్ఎంసీజీ మినహా..
ఎఫ్ఎంసీజీ(FMCG) మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు నష్టాలతో ట్రేడ్ ముగిశాయి. బీఎస్ఈలో ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 1.15 శాతం పెరిగింది. టెలికాం(Telecom) ఇండెక్స్ అత్యధికంగా 1.80 శాతం పడిపోగా.. ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 1.47 శాతం నష్టపోయింది. ఎనర్జీ(Energy) ఇండెక్స్ 1.40 శాతం, మెటల్ సూచీ 1.18 శాతం, హెల్త్కేర్ 1.07 శాతం, కమోడిటీ ఇండెక్స్ 1.03 శాతం, పీఎస్యూ, యుటిలిటీ ఇండెక్స్లు 0.94 శాతం, పీఎస్యూ బ్యాంక్ 0.85 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 0.78 శాతం, ఇన్ఫ్రా 0.70 శాతం, ఐటీ 0.46 శాతం నష్టపోయాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.85 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.70 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.40 శాతం నష్టాలతో ముగిశాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్లో 8 కంపెనీలు లాభాలతో, 22 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. హెచ్యూఎల్ 3.48 శాతం, ఎటర్నల్ 1.40 శాతం, ఐటీసీ 1.01 శాతం, కొటక్ బ్యాంక్ 0.96 శాతం, పవర్గ్రిడ్ 0.64 శాతం లాభపడ్డాయి.
Top Losers : టాటా స్టీల్ 2.20 శాతం, సన్ఫార్మా 1.69 శాతం, అదాని పోర్ట్స్ 1.50 శాతం, రిలయన్స్ 1.39 శాతం, ఎన్టీపీసీ 1.37 శాతం నష్టాలతో ముగిశాయి.