అక్షరటుడే, వెబ్డెస్క్: India US Subsea Cable | భారత్ – అమెరికా డిజిటల్ సహకారాన్ని మరింత బలపర్చే దిశగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కీలక ప్రకటన చేశారు. నేడు ఢిల్లీలో జరిగిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య సబ్–సీ కేబుల్ నెట్వర్క్ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అనంతరం భారత్లో ఏఐ రంగాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేసేలా సుందర్ పిచాయ్ ప్రకటన చేశారు.
India US Subsea Cable | ఏఐ రంగంలో భారత్ ఆదర్శ నమూనా
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితకాలంలో అత్యంత ప్రభావవంతమైన సాంకేతిక విప్లవమని సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. ఈ రంగంలో భారత్ అపూర్వమైన వేగంతో ముందుకు సాగుతోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ సాంకేతికతను సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకురావడంలో భారత్ ఉత్తమ నమూనాగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు.
సబ్సీ కేబుల్ మార్గాల ఏర్పాటు
ఏఐ సంబంధిత కనెక్టివిటీని మరింత బలపర్చేందుకు భారత్, అమెరికా, ఇతర దేశాల మధ్య కొత్త సముద్రగర్భ కేబుల్ మార్గాలను నిర్మించనున్నట్లు పిచాయ్ తెలిపారు. అమెరికా-భారత్ మధ్య నాలుగు కొత్త రూట్లు, భారత్ నుంచి సింగపూర్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా వైపు మూడు అదనపు లింకులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇది డేటా ట్రాన్స్ఫర్ను వేగవంతం చేసి రెండు దేశాల డిజిటల్ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.
విశాఖపట్నంలో గూగుల్ భారీ ఏఐ కేంద్రం
గతంలో ప్రకటించిన ప్రకారం విశాఖపట్నంలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ ఏఐ హబ్ను నిర్మిస్తోందని సుందర్ పిచాయ్ గుర్తు చేశారు. ఈ కేంద్రం గిగావాట్ స్థాయి కంప్యూటింగ్ సామర్థ్యం, అంతర్జాతీయ సబ్సీ కేబుల్ గేట్వేను కలిగి ఉంటుందని చెప్పారు.
విద్యార్థులు, నిపుణులకు..
భారతీయ విద్యార్థులు, టెక్ నిపుణుల సౌకర్యార్థం గూగుల్ తన ప్రతిష్టాత్మక ‘ఏఐ ప్రొఫెషనల్ సర్టిఫికెట్’ కార్యక్రమాన్ని ఇంగ్లిష్, హిందీ భాషల్లో ప్రారంభించనుందని పిచాయ్ పేర్కొన్నారు. గూగుల్ డీప్మైండ్తో కలిసి భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని 10వేల అటల్ టింకరింగ్ ల్యాబ్ల ద్వారా సుమారు 11 మిలియన్ల విద్యార్థులకు జెనరేటివ్ ఏఐ సాధనాలను అందుబాటులోకి తీసుకురానుందని చెప్పారు. అలాగే ‘కర్మయోగి భారత్’ కార్యక్రమంతో భాగస్వామ్యం చేసుకుని సుమారు 20 మిలియన్ల ప్రభుత్వ ఉద్యోగులకు ఏఐ శిక్షణ అందించనున్నట్లు తెలిపారు.
సైన్స్ పరిశోధనలకు మద్దతు
సైన్స్ రంగంలో వినూత్న పరిశోధనలను ప్రోత్సహించడానికి 30 బిలియన్ మిలియన్ల స్థాయిలో నిధులను ఇప్పటికే ప్రకటించినట్లు గూగుల్ సీఈవో వెల్లడించారు. ఇది భారత్లో ఏఐ ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ కనెక్టివిటీని సరికొత్త స్థాయిలోకి తీసుకెళ్తుందని ఆశిస్తున్నామని చెప్పారు.