అక్షరటుడే, వెబ్డెస్క్ : Minister Rajnath Singh | భారత ఆర్థిక వ్యవస్థను “మెర్సిడెస్”(Mercedes)తో, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను “కంకరతో నిండిన చెత్త ట్రక్కు”తో పోలుస్తూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్(Pak Army Chief General Asim Munir) ఇటీవల చేసిన వ్యాఖ్యకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
మునీర్ వ్యాఖ్యలు పాకిస్తాన్ ఆర్థిక బలహీనతను అంగీకరించడమేనన్నారు. ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం 2025లో ప్రసంగించిన ఆయన..రెండు దేశాలు ఒకే సమయంలో స్వాతంత్ర్యం పొందినప్పటికీ, ఇండియా మంచి విధానాలు, దూరదృష్టి ద్వారా బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించుకుందని గుర్తు చేశారు. అదే సమయంలో పాకిస్తాన్(Pakistan) తన సొంత వైఫల్యాల కారణంగా సంక్షోభంలో చిక్కుకుపోయిందని విమర్శించారు.
Minister Rajnath Singh | ప్రతిస్పందించేందుకు సిద్ధం..
మునీర్ వ్యాఖ్యలను కేవలం ట్రోలింగ్ గా తోసిపుచ్చకూడదని, హెచ్చరికగా చూడాలని సింగ్ హెచ్చరించారు. “మనం దీనిని తీవ్రంగా పరిగణించి తదనుగుణంగా సిద్ధం కావాల్సి ఉంది. పాకిస్తాన్ ఏం చేసినా భారత్ తగిన ప్రతిస్పందన ఇవ్వగల సామర్థ్యం కలిగి ఉంది” అని పేర్కొన్నారు. “ఈ తీవ్రమైన హెచ్చరిక వెనుక ఉన్న చారిత్రక సూచనను మనం గమనించకపోతే, అది మనకు ఆందోళన కలిగించే అంశంగా మారవచ్చు. మనం దీనిపై దృష్టి సారించాలి. పాక్ దేనికైనా సిద్ధమైతే, అటువంటి వాటికి మనం తగిన సమాధానం ఇవ్వగలమని” అని తెలిపారు.
Minister Rajnath Singh | అమెరికాకూ రాజ్నాథ్ కౌంటర్
భారత్ మాత్రమే ప్రపంచ సరఫరా గొలుసులను బలోపేతం చేయగలదని రాజ్నాథ్(Minister Rajnath Singh) అన్నారు. ప్రపంచ సరఫరా గొలుసు అంతరాయం వల్ల అనేక దేశాలు గణనీయంగా ప్రభావితమైనప్పుడు, ఇండియా దాన్ని బలోపేతం చేయగలదని ట్రంప్ టారిఫ్ల గురించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. నేడు ప్రపంచంలోని పెద్ద దేశాలు చైనా ప్లస్ గురించి మాట్లాడుతాయి. కానీ, భారతదేశం(India) కాకుండా వేరే ఏ దేశం ఈ పని చేయగలదని ప్రశ్నించారు. మన దేశ స్వావలంబన గురించి మాట్లాడేటప్పుడు, అది కేవలం దిగుమతి ప్రత్యామ్నాయ విధానం మాత్రమే కాదు, దాని వెనుక ప్రపంచ మంచి భావన కూడా ఉందన్నారు. దాని వెనుక ప్రపంచానికి బలమైన సరఫరా గొలుసును అందించాలనే భావన ఉందని ఆయన అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఇండియాపై విశ్వాసం ఉందన్న రక్షణ శాఖ మంత్రి… భారతదేశం గ్లోబల్-AI-హబ్గా మారాలని మేము కోరుకుంటున్నామని చెప్పారు. ‘‘మా ప్రభుత్వం సెమీకండక్టర్లపై పనిని మిషన్ మోడ్లో ముందుకు తీసుకెళ్లింది. ప్రధానమంత్రి(Prime Minsiter) తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో చెప్పినట్లుగా, ఈ సంవత్సరం చివరి నాటికి, మనం తయారు చేసిన ‘మేడ్ ఇన్ ఇండియా’ సెమీకండక్టర్లు మార్కెట్లోకి ప్రవేశిస్తాయి” అని తెలిపారు. భారతదేశ శక్తివంతమైన రక్షణ తయారీ పర్యావరణ వ్యవస్థలో పెట్టుబడి పెట్టడానికి అన్ని విదేశీ కంపెనీలు ముందుకు రావాలని సింగ్ పిలుపునిచ్చారు.