అక్షరటుడే, వెబ్డెస్క్: IND vs SL | ఆసియా కప్ 2025 టోర్నీలో ఇప్పటివరకు టీమిండియా India ఓడింది లేదు. అటు గ్రూప్ లీగ్లో, ఇటు సూపర్ 4లో ప్రతి మ్యాచ్ గెలుస్తూనే వచ్చింది. ఇక ఇప్పటికే ఫైనల్కి చేరుకున్న భారత్ గత రాత్రి శ్రీలంకతో నామమాత్రపు మ్యాచ్ ఆడింది. శుక్రవారం రాత్రి జరిగిన IND vs SL మ్యాచ్ క్రికెట్ ప్రియులకి మంచి మజాని అందించింది అని చెప్పాలి. స్కోరు టై కావడంతో సూపర్ ఓవర్ లో మ్యాచ్ ఫలితం వచ్చింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 202/5 స్కోరు చేసింది. అభిషేక్ శర్మ 31 బంతుల్లో 61 (8 ఫోర్లు, 2 సిక్స్లు), తిలక్ వర్మ 49 నాటౌట్ (34 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్స్), సంజూ శాంసన్ 39 పరుగులు (23 బంతుల్లో, 1 ఫోర్, 3 సిక్స్లు), అక్షర్ పటేల్ 21 నాటౌట్ (15 బంతుల్లో) పరుగులు రాబట్టారు.
IND vs SL | సూపర్ ఓవర్లో..
శ్రీలంక బౌలర్లలో మహీష్ తీక్షణ, హసరంగ, చమీర, షనక, అసలంక చెరో వికెట్ తీసారు.ఇక భారీ లక్ష్యాన్ని చేజ్ చేసే క్రమంలో శ్రీలంక కూడా ధీటుగా ఆడింది. పాతుమ్ నిస్సంక 107 (58 బంతుల్లో, 7 ఫోర్లు, 6 సిక్స్లు), కుశాల్ పెరీరా 58 పరుగులు (32 బంతుల్లో, 8 ఫోర్లు, 1 సిక్స్), డసన్ షనక 22 నాటౌట్ (11 బంతుల్లో) పరుగులు చేయడంతో శ్రీలంక కూడా 20 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. దీంతో స్కోరు టై అయింది. భారత బౌలర్లలో హార్దిక్, కుల్దీప్, వరుణ్, అర్ష్దీప్, హర్షిత్ చెరో వికెట్ తీశారు. అయితే శ్రీలంక చివరి ఓవర్లో గెలుపుకి 12 పరుగులు అవసరం. హర్షిత్ రాణా Harshit Rana మొదటి బంతికే నిస్సంకను ఔట్ చేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. చివరి బంతికి అవసరమైన మూడు పరుగులు రావడం కుదరకపోవడంతో మ్యాచ్ టై అయింది.
సూపర్ ఓవర్ లో ముందుగా శ్రీలంక Srilanka బ్యాటింగ్ చేయగా, అర్ష్దీప్ బౌలింగ్ చేశాడు.కుశాల్ పెరీరాని డకౌట్ చేయగా, డసన్ షనక వివాదాస్పద రివ్యూలో బయటపడ్డా, వెంటనే ఔట్ అయ్యాడు. దీంతో శ్రీలంక కేవలం 2 పరుగులు మాత్రమే చేసింది. భారత్ టార్గెట్ 3 పరుగులు కాగా, తొలి బంతికే మూడు పరుగులు చేసి గెలుపు సాధించింది. అయితే ఈ మ్యాచ్లో డసన్ షనక రన్ తీసే క్రమంలో రనౌట్ అయ్యాడు. కానీ అంపైర్ ముందు దానిని క్యాచ్ ఔట్ గా ప్రకటించడంతో, బంతి డెడ్ బాల్గా పరిగణనలోకి వచ్చి రన్ ఔట్ లెక్కలోకి రాలేదు. ఇది నిష్పక్షపాతమైనా, ప్రేక్షకులలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ గెలుపుతో టీమిండియా టోర్నీలో వరుసగా 6 మ్యాచ్లు గెలిచి పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది.ఇక ఆదివారం పాక్తో 41 ఏళ్ల తర్వాత ఆసియా కప్ ఫైనల్లో తలపడనుంది టీమిండియా.