అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : దేశ రాజకీయాల్లో ధన ప్రభావం పెరిగి ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ధన ప్రభావం తగ్గి విలువలతో కూడిన సిద్ధాంతపరమైన రాజకీయాలు రావాలని ఆకాంక్షించారు. సిద్ధాంతపరమైన రాజకీయాలు కానరావడం లేదని, ప్రస్తుతం ఎవరెంత వేగంగా డెలివరీ చేస్తారనే ‘స్విగ్గీ పాలిటిక్స్’ తెరమీదకొచ్చాయన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకర పరిణామమని ఆందోళన వ్యక్తం చేశారు.
హైదరాబాద్లో శుక్రవారం (జులై 26) క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ Capital Foundation Society, ICFAI సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉత్తమ పార్లమెంటేరియన్ స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి పేరిట నెలకొల్పిన స్మారక అవార్డును ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రముఖ రచయిత, మోహన్ గురుస్వామి Mohan Guruswamy కి అందజేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. “జైపాల్ రెడ్డి విద్యార్థి నాయకుడిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, సెంట్రల్ మినిస్టర్గా అనేక హోదాల్లో ప్రాతినిధ్యం వహించిన విషయాన్ని ప్రస్తావించారు. ఆయన సుదీర్ఘంగా సిద్ధాంతపరమైన రాజకీయాలు కొనసాగించారని సీఎం పేర్కొన్నారు.
1984 లో పార్లమెంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి 35 ఏళ్లు వెనుదిరిగి చూడకుండా దేశ రాజకీయాల్లో రాణించారని గుర్తుచేశారు. 1969 లో అడుగుపెట్టి 50 సంవత్సరాలు 2019 చివరి శ్వాస వరకు ప్రజల పక్షాన, ప్రజా సమస్యల పరిష్కారానికి, దేశ విధివిధానాలను అమలు చేయడంలోనే కృషి చేశారని చెప్పారు.
పెట్రోలియం శాఖ మంత్రిగా కీలక నిర్ణయాలు తీసుకున్నారని, సమాచార శాఖ మంత్రిగా ప్రసార భారత చట్టాన్ని తీసుకొచ్చారని గుర్తుచేశారు.
CM Revanth | యూనివర్సిటీల్లో సిద్ధాంతపరమైన విద్యార్థి రాజకీయాలు..
యూనివర్సిటీల్లో సిద్ధాంతపరమైన విద్యార్థి రాజకీయాలు రావలసిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి నొక్కి చెప్పారు. దేశ రాజకీయాల్లో ధన ప్రభావం తగ్గాలని ఆకాంక్షించారు. వ్యక్తిగత రాజకీయాలకంటే సిద్ధాంతపరమైన భిన్నాభిప్రాయాలు ఉండే రాజకీయాలు ప్రజాస్వామిక విలువలను కాపాడతాయని అన్నారు.
కాగా, అంతకు ముందు సదస్సులో ‘భారత్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ముందున్న సవాళ్లు’ అన్న అంశంపై రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సస్మిత్ పాత్ర ప్రసంగించారు. కార్యక్రమంలో Capital foundation Society ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ప్రొ. పురుశోత్తం రెడ్డి, ICFAI ఛైర్పర్సన్ యశస్వీ శోభారాణి, వైస్ ఛాన్సెలర్ ప్రొఫెసర్ ఎల్ఎస్ గణేష్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.