అక్షరటుడే, వెబ్డెస్క్: Nizamabad city | నిజామాబాద్ శివారులోని అర్సపల్లిలో గల ప్రభుత్వ భూమిలో మళ్లీ అక్రమ నిర్మాణాలు మొదలయ్యాయి. సర్వే నంబర్ 249లో కొందరు అక్రమార్కులు ఓ మాజీ కార్పొరేటర్ సాయంతో ఇళ్ల నిర్మాణాలను చేపడుతున్నారు. గతంలో ఈ సర్వే నంబర్లో నిర్మాణాలు చేపట్టగా.. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వ భూమిగా తేల్చారు. అనంతరం హద్దులు ఫిక్స్ చేసి కట్టడాలను నిలిపివేయించారు. తిరిగి అధికారులు పట్టించుకోకపోవడంతో మళ్లీ అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది.
Nizamabad city | నిజామాబాద్ నార్త్ మండలంలో..
నిజామాబాద్ నార్త్ మండలంలోని సర్వే నంబర్ 249లో మొత్తం 1,581 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి గతంలో కొందరు ఇళ్లు నిర్మించారు. దీంతో అప్పట్లో ఆరో టౌన్ పోలీసులు 13 మందిపై కేసు నమోదు చేశారు. క్షేత్రస్థాయిలో సర్వే జరిపి ఇళ్లు నిర్మించిన వారికి నోటీసులు ఇచ్చారు. అయితే ఈ మొత్తం వ్యవహారం వెనుక అధికార పార్టీలో ఉన్న ఓ మాజీ కార్పొరేటర్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. అతగాడి అందండలతోనే తాజాగా కొందరు డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మిస్తున్నట్లు సమాచారం. సదరు మాజీ కార్పొరేటర్ నకిలీ దస్త్రాలను సృష్టించి 249 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమిని పేదలకు విక్రయించాడు. వాటి ఆధారంగానే పలువురు నిర్మాణాలు పూర్తి చేశారు.
Nizamabad city | మాజీ కార్పొరేటర్ అండదండలు..
గత కొద్దిరోజులుగా అధికారులెవరూ అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో తిరిగి అక్రమ నిర్మాణాలు మొదలు పెట్టినట్లు సమాచారం. మరో వైపు మాజీ కార్పొరేటర్ అండదండలు అందించడమే కాకుండా.. డబుల్ బెడ్రూం ఇళ్ల కింద ఆర్థిక సహాయం అందించేలా చూస్తానని వారికి హామీ ఇవ్వడం కొసమెరుపు. వాస్తవానికి ప్రభుత్వ భూమిలో నిర్మించే ఇళ్లకు రెండు పడక గదుల ఇళ్ల స్కీం వర్తించదు. అయినప్పటికీ సదరు మాజీ ప్రజాప్రతినిధి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారికి అండదండలు అందించడం గమనార్హం.
Nizamabad city | కళ్లు మూసుకున్న అధికారులు
ప్రభుత్వ భూమిలో తిరిగి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెతి చూడడం లేదు. అధికార పార్టీ మాజీ కార్పొరేటర్ ఓ మైనారిటీ నేతకు అత్యంత సన్నిహితంగా ఉండడంతో అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి సాధారణ ప్రజలు అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకునే అధికారులు ఇక్కడ కనీసం పట్టించుకోవడం లేదు. గతంలో హడావుడి చేసి కేసులు నమోదు చేసినా.. తాజాగా కేసు అటకెక్కించారు. కేసును సైతం నీరు గార్చినట్లు సమాచారం. అధికారులు ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.