అక్షరటుడే, వెబ్డెస్క్: KTR | బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసినట్లు నిరూపిస్తే తాను రాజకీయాలు (Politics) వదిలేస్తానని సవాల్ విసిరారు. ఈ మేరకు ఆయన బుధవారం ఎక్స్ లో ఓ పోస్టు చేశారు. ‘‘డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో (Deputy CM Bhatti Vikramarka) పాటు క్యాబినెట్ మంత్రులంతా తెలంగాణలో ఎక్కడికైనా వెళ్లి.. తమ ప్రభుత్వం ఆరు హామీలు నెరవేర్చామని చెప్పాలి. మీ అబద్ధాలు, తప్పుడు ప్రచారాలపై ప్రజలు మిమ్మల్ని తరిమికొట్టక పోతే.. నేను రాజకీయాలను విడిచి పెడతానని’ కేటీఆర్ పేర్కొన్నారు.
KTR | ఆరు గ్యారంటీలు గుర్తున్నాయా..
కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఇచ్చిన ఆరు గ్యారంటీలు గుర్తున్నాయా? అని కేటీఆర్ ప్రశ్నించారు. 100 రోజులు కాదు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అయినా ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఇంకా నెరవేర్చలేదంటూ మండిపడ్డారు. అసలు కాంగ్రెస్ పార్టీకి ఆరు గ్యారెంటీల వాగ్దానం గుర్తుందా ? అని నిలదీశారు. ఇచ్చిన హామీలు అమలు చేశామని తెలంగాణలోని ఏ గ్రామానికైనా వెళ్లి చెప్పగలరా? అంటూ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు సవాల్ విసిరారు. ఇప్పటికే అబద్దాలు చెప్పిన మీ నాయకులను ప్రజలు వెంబడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.