అక్షరటుడే, వెబ్డెస్క్ : Hydraa | హైదరాబాద్ నగరంలో హైడ్రా మరోసారి కూల్చివేతలు చేపట్టింది. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ (Manikonda Municipality) పరిధిలోని పుప్పాలగూడలో అక్రమ నిర్మాణాలను హైడ్రా సిబ్బంది తొలగించారు.
పుప్పాలగూడలో (Puppalaguda) ప్రభుత్వ భూమిపై కొందరు కబ్జాదారులు కన్ను వేశారు. 500 గజాల స్థలాన్ని ఆక్రమించి ఐదు ప్లాట్లుగా చేశారు. అందులో షెడ్లు సైతం నిర్మించారు. దీనిపై హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. విచారణ చేపట్టిన హైడ్రా అధికారులు (Hydraa Officers) అది ప్రభుత్వ భూమిగా నిర్ధారించారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఆక్రమణలను తొలగించారు. అయితే అక్రమ నిర్మాణాలను తొలగిస్తుండగా.. స్థానికులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతంగా మారింది. అప్పటికే భారీగా పోలీసులు ఘటనా స్థలంలో మోహరించారు. జేసీబీలను అడ్డుకున్న వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం ఆ భూమిలో ఆక్రమణలు తొలగించి ప్రభుత్వ భూమి అని బోర్డు ఏర్పాటు చేశారు.
Hydraa | కబ్జాలపై ఉక్కుపాదం
హైదరాబాద్ (Hyderabad) నగరంలో ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాల పరిరక్షణ కోసం ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే హైడ్రా నగరంలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది. పదుల సంఖ్యలో పార్కులను కబ్జా చెర నుంచి విడిపించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. నాలాలు, చెరువుల్లో నిర్మాణాలను కూల్చి వేసి వరద ముంపు నివారణ చర్యలు చేపట్టింది. ప్రజావాణి ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి హైడ్రా అధికారులు ఆక్రమణాలను తొలగిస్తున్నారు. హైడ్రా కబ్జాలపై ఉక్కుపాదం మోపుతుండడంతో కబ్జాదారుల్లో ఆందోళన నెలకొంది. ఎక్కడ తాము అక్రమంగా నిర్మించిన కట్టడాలు కూల్చివేస్తారోనని భయపడుతున్నారు.