అక్షరటుడే, వెబ్డెస్క్ : Hydraa | ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. హైదరాబాద్ (Hyderabad) నగరంలోని చెరువులు, నాలాలు పరిరక్షించడంతో పాటు రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడుతోంది. గతంలో మూసి నది (Musi River)ని ఆక్రమించి దాదాపు 9 ఎకరాల్లో వేసిన షెడ్లను హైడ్రా కూల్చివేసింది. ఇటీవల మాదాపూర్ (Madhapur) శివారులోని ఓ ఎన్క్లేవ్లో పార్కులు, రోడ్లను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలు తొలగించి రూ.400 కోట్ల స్థలాన్ని కాపాడింది. తాజాగా రూ.100 కోట్ల విలువైన భూమిని స్వాధీనం చేసుకుంది.
నగరంలోని జూబ్లీహిల్స్ చెక్పోస్టుకు (Jubilee Hills Checkpost) సమీపంలో ప్రధాన రహదారికి ఆనుకుని భూమి ఉంది. లే అవుట్ ప్రకారం దాదాపు రెండు వేల గజాల స్థలాన్ని ప్రజ అవసరాల కోసం కేటాయించారు. అయితే దీనిని ఓ వ్యక్తి ఆక్రమించాడు. సోమవారం అధికారులు ఆ భూమిలో ఉన్న నర్సరీని కూల్చి వేసింది. రెండు వేల గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ భూమి విలువ దాదాపు రూ.వంద కోట్ల వరకు ఉంటుందని అంచనా.
Hydraa | రెండు దశాబ్దాలుగా..
జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ సమీపంలోని భూమి రెండు దశాబ్దాలుగా అక్రమార్కుల చేతిలో ఉంది. జూబ్లీహిల్స్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీకి సంబంధించిన ఈ భూమి లే ఔట్ ప్రకారం ప్రజావసరాలకు ఉద్దేశించారు. అయితే పిల్లా సత్యనారాయణ అనే వ్యక్తి దానిని ఆక్రమించి.. ఫేక్ ఇంటి నంబరు క్రియేట్ చేసి అందులో నర్సరీ (Nursery) నడుపుతున్నాడు. ఈయనపై జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు కూడా నమోదైంది. జీహెచ్ఎంసీ పలుమార్లు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసింది. ఆక్రమణకు పాల్పడిన సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించాడు. కోర్టును కూడా తప్పుదోవ పట్టించి స్టే తెచ్చుకున్నాడు.
Hydraa | ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో..
జూబ్లీహిల్స్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ సభ్యులు ఆక్రమణలపై హైడ్రా ప్రజావాణిలో (Hydraa Prajavani) ఫిర్యాదు చేశారు. హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. అది ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలంగా నిర్ధారించారు. నర్సరీ నడుపుతున్న సత్యనారాయణకు నోటీసులు ఇచ్చారు. దీనిపై ఆయన హైకోర్టు (High Court)ను ఆశ్రయించగా అక్కడ చుక్కెదురైంది. గతంలో ఇచ్చిన స్టేను కూడా తొలగించింది. దీంతో హైడ్రా అధికారులు సోమవారం కూల్చి వేతలు చేపట్టారు.