అక్షరటుడే, వెబ్డెస్క్ : Hydraa Prajavani | హైదరాబాద్ (Hyderabad) నగరంలో చెరువులు, ప్రభుత్వ స్థలాలను కాపాడడానికి ప్రభుత్వం హైడ్రా (Hydraa)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయా ప్రాంతాల్లో ఆక్రమణలపై ఫిర్యాదులు స్వీకరించడానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydra Commissioner Ranganath) ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను విచారించి ఆక్రమణలను నిజమని తేలితే కూల్చి వేస్తున్నారు. దీంతో హైడ్రా ప్రజావాణికి మంచి స్పందన వస్తోంది.
Hydraa Prajavani | 49 ఫిర్యాదులు
ఇంటి ఎదురుగా రోడ్డు ఉంటే కలిపేయడం.. పార్కు ఉంటే ఆక్రమించేయడం.. కాలువ పైనే నిర్మాణం చేసేయడం ఇలా చాలా మంది ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారిపై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేస్తున్నారు. రోడ్లను ఆక్రమించడం.. అడ్డంగా గోడ కట్టేయడంతో దారి లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా సోమవారం హైడ్రా నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 49 ఫిర్యాదులు రాగా.. అందులో ఎక్కువ శాతం రహదారులు(Roads), పార్కుల (Parks) ఆక్రమణలపైనే ఉన్నాయి. సంబంధిత అధికారులకు ఫిర్యాదులను విచారించాలని సూచించారు.
Hydraa Prajavani | రోడ్డును కబ్జా చేశారని ఫిర్యాదు
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం (Gajula Ramaram) సిద్ధివినాయకనగర్లో 30 అడుగుల విస్తీర్ణంలో ఉన్న రోడ్డును కబ్జా చేశారంటూ స్థానికులు ఫిర్యాదు చేశారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం, బొడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని చెంగిచెర్ల (Chengicherla) గ్రామానికి చెందిన చిన్న క్రాంతి కాలనీలో పార్కును కబ్జాచేశారని ఫిర్యాదు చేశారు. 1800 గజాల పార్కు స్థలాన్ని అనధికారికంగా నకిలీ ప్లాట్ నంబర్లు వేసి ఆక్రమించేశారని పేర్కొన్నారు.
Hydraa Prajavani | రోడ్డుపై గోడ కట్టారని..
రంగారెడ్డి (Rangareddy) జిల్లా పోతాయపల్లికి చెందిన కొందరు తమ ఇంటికి వెళ్లే రహదారిని కబ్జా చేశారంటూ ఫిర్యాదు చేశారు. అదే గ్రామానికి చెందిన కొంతమంది రహదారిపై అక్రమంగా గోడ నిర్మించి దారిని పూర్తిగా మూసేసి నిర్మాణం కూడా చేపట్టారని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి (Serilingampally) మండలంలోని కొండాపూర్ జూబ్లీ గార్డెన్ కాలనీలో ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల కబ్జాలను వెంటనే ఆపాలని కాలనీవాసులు ప్రజావాణికి ఫిర్యాదు చేశారు.
కొత్తగూడ గ్రామం సర్వే నెం. 30లో 14 గుంటలు, సర్వే నెం. 29లో ఎకరం 2 గుంటల భూమి ప్రభుత్వానికి చెందినదిగా రికార్డుల్లో ఉంది. కాంపౌండ్ వాల్ను శేరిలింగంపల్లి రెవెన్యూ ఇన్స్పెక్టర్ కూడా కూల్చారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం భూమిని సరిగా గుర్తించి.. తక్షణమే రక్షణ చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మేడిపల్లికి చెందిన ఫీర్జాదీగూడలోని 30 అడుగుల రోడ్డును కబ్జా చేశారంటూ శ్రీ సాయి కాలనీ వాసులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అదే ప్రాంతంలోని పంచవటి కాలనీకి చెందిన కొంతమంది ఈ రహదారిని ఆక్రమిస్తూ రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.