అక్షరటుడే, వెబ్డెస్క్ : Hydraa | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు. ఆక్రమణలను తొలగించి వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి (Gachibowli)లో 600 గజాల స్థలాన్ని హైడ్రా కాపాడింది. ఈ స్థలం విలువ రూ.11 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. తెలంగాణ సెక్రటేరియట్ మ్యూచ్యువల్ ఎయిడెడ్ కోపరేటివ్ సొసైటీకి చెందిన 24 ఎకరాల లే ఔట్లో రెండు పార్కులను మంగళవారం హైడ్రా సిబ్బంది కాపాడారు.
Hydraa | ఫిర్యాదు రావడంతో..
లే ఔట్లో పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను సొసైటీ నిర్వాహకులు అమ్మినట్లు హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. దీంతో అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. అనంతరం అవి పార్క్ స్థలాలు అని తేలడంతో ఆక్రమణలను తొలగించి చుట్టూ ఫెన్సింగ్ వేశారు. ఈ మేరకు హైడ్రా పరిరక్షించిన పార్కు స్థలంగా పేర్కొంటూ బోర్డులు కూడా సిబ్బంది ఏర్పాటు చేశారు. అక్రమంగా అమ్మకాలు, కొనుగోళ్లు జరిగిన తీరుపై పూర్తి స్థాయిలో హైడ్రా విచారిస్తోంది. ఎవరు అమ్మారు.. ఎలా అమ్మారు.. ఎలా కొన్నారు అనే విషయాలతో పాటు.. వీటి వెనుక ఎవరెవరు ఉన్నారనేదానిపై పూర్తి స్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటామని హైడ్రా ప్రకటించింది.
Hydraa | ప్రజాకవి కాళోజీకి హైడ్రా నివాళి
ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Ranganath) నివాళులర్పించారు. ఉద్యమమే ఊపిరిగా ప్రజాకవి కాళోజీ జీవించారని హైడ్రా కమిషనర్ పేర్కొన్నారు. హైడ్రా అడ్మిన్ ఎస్పీ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.