అక్షరటుడే, వెబ్డెస్క్ : Hydraa | హైడ్రాలో విధులు నిర్వర్తిస్తున్న మార్షల్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఆక్రమణలు తొలగించడానికి ప్రభుత్వం హైడ్రా (Hydraa)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అంతేగాకుండా వర్షాలతో ముంపు ఉన్న ప్రాంతాల్లో హైడ్రా సిబ్బంది అత్యవసర సేవలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా హైడ్రాలో మాజీ సైనికులను మార్షల్స్గా నియమించారు. అయితే వారి జీతాలను ఇటీవల హైడ్రా తగ్గించింది. దీంతో విధులు బహిష్కరిస్తున్నట్లు వారు ప్రకటించారు.
Hydraa | ఆపరేషన్ మాన్సూన్పై ప్రభావం
వర్షాల నేపథ్యంలో నగరంలో హైడ్రా ఆపరేషన్ మాన్సూన్ (Operation Mansoon) కార్యక్రమం చేపట్టింది. అయితే మార్షల్స్ (Marshals) విధుల బహిష్కరించడంతో ఈ ఆపరేషన్పై ప్రభావం పడింది. హైడ్రా కంట్రోల్ రూమ్ సేవలకు అంతరాయం కలిగింది. ట్రైనింగ్ కార్యక్రమం, ప్రజావాణి సేవలు నిలిచిపోయాయి. గ్రేటర్ హైదరాబాద్లోని 150 డివిజన్లలో సేవలు బంద్ అయ్యాయి. 51 హైడ్రా భారీ వాహనాల సేవలు, ఎమర్జెన్సీ సేవలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.
Hydraa | 90 మంది మాజీ సైనికులు
నగరంలో వర్షాకాల సంబంధిత సవాళ్లను పరిష్కరించడానికి హైడ్రాలో సైనిక సిబ్బందిని నియమించారు. ఐదు నెలల పాటు 90 మాజీ సైనికులను ‘మార్షల్స్’గా హైడ్రా నియమించింది. వీరు నగరంలోని ఎమర్జెన్సీ టీమ్లను నడిపిస్తారు. అంతేగాకుండా చెరువుల రక్షణకు చర్యలు చేపడతారు. మార్షల్స్ కాంట్రాక్టర్ల కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. బిల్లుల చెల్లింపునకు ముందు కాంట్రాక్టర్లు వరద ముంపు సమస్యలను పరిష్కరించారా, పడిపోయిన చెట్లను తొలగించారా అని మార్షల్స్ పరిశీలిస్తారు. ప్రస్తుతం వీరు విధులు బహిష్కరించడంతో ఆయా సేవలు నిలిచిపోయాయి. దీంతో భారీ వర్షం పడితే నగరవాసులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది.