అక్షరటుడే, వెబ్డెస్క్ : Hydraa | ప్రమాదాల నివారణకు విద్యుత్, ఫైర్, ఇండస్ట్రీ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. ఎలక్ట్రికల్ సేఫ్టీ ఇన్ బిల్డింగ్స్ అనే అంశంపై శనివారం హైడ్రా కార్యాలయంలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యుత్ వినియోగంలో ఉన్న లోపాలతోనే ఎక్కువ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వీటి నివారణకు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.
Hydraa | నోడల్ ఏజెన్సీతో తనిఖీలు
భద్రతకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారో లేదో పరిశీలించడానికి సంబంధిత విభాగాలకు చెందిన నిపుణుల బృందంతో ఒక నోడల్ ఏజెన్సీని రూపొందించాలని అభిప్రాయపడ్డారు. విద్యుత్ వైరింగ్, ఎర్తింగ్, నాణ్యమైన ఎలక్ట్రిక్ పరికరాలను వినియోగిస్తున్నారా లేదా అనేది తనిఖీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమలే కాకుండా అపార్టుమెంట్లు, కార్యాలయాలు, నివాసాలలో కూడా భద్రతా ప్రమాణాలు పాటించేలా ఈ నోడల్ ఏజెన్సీ చూడాలన్నారు.
