అక్షరటుడే, వెబ్డెస్క్ : Break Fast Scheme | నగరంలోని సామాన్య ప్రజల ఆకలి తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఇప్పుడు రూ.5కే నాణ్యమైన అల్పాహారం అందించేందుకు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.
హరే కృష్ణ ఫౌండేషన్ (Hare Krishna Foundation) సహకారంతో ఈ పథకం అమలు చేయనున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో అమలవుతున్న రూ.5 భోజన పథకంలో భాగంగా, త్వరలో ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్ఫాస్ట్ కూడా అందుబాటులోకి రానుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెలాఖరులోగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.
Break Fast Scheme | రోజుకు 25 వేల మందికి..
ప్రతిరోజూ 25,000 మందికి టిఫిన్ అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం నగరవ్యాప్తంగా ఉన్న 139 క్యాంటీన్లను 150కి పెంచగా, కొన్ని పాత స్టాల్స్ స్థానంలో కొత్త స్టాల్స్ నిర్మించేందుకు రూ.11.43 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే 60 కొత్త స్టాల్స్ పూర్తయ్యాయి. వీటిలో త్రిభుజాకార డిజైన్, ఎక్కువ స్థలం, మెరుగైన వసతులు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రతి టిఫిన్కు సుమారు రూ.19 ఖర్చవుతున్నప్పటికీ, ప్రజల నుంచి కేవలం రూ.5 మాత్రమే వసూలు చేస్తారు. మిగిలిన రూ.14 GHMC భరించనుంది. సోమవారం నుంచి శనివారం వరకు ఒక్కో రోజు వేరువేరు రకాల టిఫిన్లు అందించనున్నారు. ఇందులో ఇడ్లీ, పొంగల్, పూరీ, ఉప్మా వంటి ఆరోగ్యకరమైనవి ఉండనున్నాయి.
ఈ స్కీం (Break Fast Scheme) ద్వారా బస్తీ వాసులు, రోజు వారీ కూలీలు, చిన్న ఉద్యోగులు వంటి మధ్యతరగతి, పేద తరగతి ప్రజలకు ఎంతో ఉపయోగం కలుగుతుంది. ఇప్పటికే రూ.5 భోజన పథకం ద్వారా ప్రజల మద్దతు పొందిన ప్రభుత్వం, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ స్కీం ద్వారా మరింత నమ్మకాన్ని సంపాదించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ పథకం ప్రారంభమైతే, హైదరాబాద్లో సామాన్యుడికి పొద్దున తినేందుకు చౌకగా, ఆరోగ్యమైన టిఫిన్ అందే అవకాశం లభించనుంది.