అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యం (Air Pollution) ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. గాలి నాణ్యత సూచిక (AQI) ఏకంగా 220 స్థాయికి పెరగడంతో భాగ్యనగరం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
గాలిలో పీఎం 10, పీఎం 2.5 వంటి సూక్ష్మ ధూళి కణాల పరిమాణం విపరీతంగా పెరగడం వల్ల వృద్ధులు, చిన్నారులు, ఆస్తమా తదితర శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా ఏక్యూఐ 50 లోపు ఉంటే ఆరోగ్యకరంగా, 100 వరకు ఉంటే ఫర్వాలేదని భావిస్తారు. అయితే ప్రస్తుతం నగరంలో 200 దాటిన స్థాయికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
Hyderabad | తగ్గుతున్న గాలి నాణ్యత
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (Central Pollution Control Board) గణాంకాల ప్రకారం.. బొల్లారం, పటాన్చెరు, హెచ్సీయూ, సోమాజిగూడ, జూపార్క్ పరిసర ప్రాంతాల్లో గాలి కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సనత్నగర్, మలక్పేట, నాచారం, కోకాపేట (Kokapet) వంటి ప్రాంతాల్లో గాలి నాణ్యత సంతృప్త స్థాయి నుంచి ప్రమాదకర దశకు చేరువవుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతాల నుంచి వెలువడుతున్న పొగ, వాహనాల అధిక రద్దీ, నిర్మాణ కార్యకలాపాలే ఈ పరిస్థితికి ప్రధాన కారణాలని జేఎన్టీయూ (JNTU) పర్యావరణ విభాగం అధికారులు చెబుతున్నారు. రానున్న చలికాలంలో గాలిలో ధూళి కణాలు మరింత నిలిచిపోయే అవకాశం ఉండడంతో కాలుష్య తీవ్రత ఇంకా పెరిగే ప్రమాదం ఉందని వారు అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు వీలైనంత వరకు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, శ్వాస సంబంధిత సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. అయితే ఈ అంశంపై కాలుష్య నియంత్రణ మండలి (PCB) అధికారులు భిన్నంగా స్పందించారు. నగరంలో గాలి నాణ్యత (Air Quality) మొత్తం మీద సంతృప్తికరంగానే ఉందని, కొన్ని థర్డ్ పార్టీ యాప్లు వాస్తవానికి మించిన కాలుష్య సూచికలను చూపిస్తున్నాయని వారు పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్య పరిరక్షణ చర్యలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.