Homeతాజావార్తలుRiyaz Encounter | రియాజ్​ ఎన్​కౌంటర్​పై మానవ హక్కుల కమిషన్​ కీలక ఆదేశాలు

Riyaz Encounter | రియాజ్​ ఎన్​కౌంటర్​పై మానవ హక్కుల కమిషన్​ కీలక ఆదేశాలు

నిజామాబాద్​ నగరంలో ఇటీవల చోటు చేసుకున్న రియాజ్​ ఎన్​కౌంటర్​పై తెలంగాణ మానవ హక్కుల కమిషన్​ స్పందించింది. ఎన్‌కౌంటర్ ఘటనను సుమోటోగా స్వీకరించింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Riyaz Encounter | నిజామాబాద్​ (Nizamabad) నగరంలో ఇటీవల చోటు చేసుకున్న రియాజ్​ ఎన్​కౌంటర్​పై తెలంగాణ మానవ హక్కుల కమిషన్​ స్పందించింది. మీడియా కథనాల ఆధారంగా ఎన్‌కౌంటర్ ఘటనను సుమోటోగా స్వీకరించింది. నవంబర్ 24లోగా ఘటనపై పూర్తి నివేదిక సమర్పించాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.

పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న రియాజ్​ను ఇటీవల పోలీసులు అరెస్ట్​ చేయడానికి వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అతడు కానిస్టేబుల్​ ప్రమోద్​ (Constable Pramod)పై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితుడు రియాజ్​ పారిపోగా.. పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించి అరెస్ట్​ చేశారు. అరెస్ట్​ సమయంలో రియాజ్​ (Riyaz) మరోసారి పోలీసులపై దాడి చేశాడు. ఈ సమయంలో రియాజ్​ సైతం గాయపడ్డాడు. దీంతో అతడిని నిజామాబాద్​ జీజీహెచ్​కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో సోమవారం రియాజ్​ పోలీసులు తుపాకీ లాక్కొని కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా జరిపిన కాల్పుల్లో రియాజ్​ హతం అయ్యాడు.

Riyaz Encounter | సుమోటోగా విచారణ

ఈ ఘటనపై మానవ హక్కుల కమిషన్​ (Telangana Human Rights Commission) స్పందించింది. ఈ సంఘటన కస్టడీ పరిస్థితులకు సంబంధించినది, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద జీవించే హక్కుకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తుతుందని కమిషన్​ అభిప్రాయ పడింది. ఈ విషయం తీవ్రత, మానవ హక్కుల చిక్కుల దృష్ట్యా సుమోటో (Sumoto)గా విచారణకు తగిన కేసు అని కమిషన్ అభిప్రాయపడింది. ఎన్‌కౌంటర్‌కు దారితీసిన పరిస్థితులు, మెజిస్టీరియల్ విచారణ స్థితి, ఆదేశించిన ఏవైనా శాఖాపరమైన/న్యాయపరమైన చర్యలు, ఎన్‌కౌంటర్ మరణాలపై ఎన్​హెచ్​ఆర్​సీ, సుప్రీంకోర్టు (Supreme Court) మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండటం, FIR కాపీ, పోస్ట్‌మార్టం నివేదికతో సహా వివరణాత్మక వాస్తవ నివేదికను సమర్పించాలని డీజీపీని ఆదేశించింది.