అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | హైదరాబాద్ నగరంలో గంజాయి దందా జోరుగా సాగుతోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా అక్రమార్కులు దందా సాగిస్తున్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసలుగా మారి యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం ఈగల్ టీమ్ (Eagle Team) ఏర్పాటు చేసింది. ఈగల్ టీమ్ పోలీసులు దాడులు చేపడుతున్నా.. గంజాయి, డ్రగ్స్ విక్రయాలు ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్ నగరంలో భారీ మొత్తంలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహేశ్వరం, రాచకొండ SOT పోలీసుల జాయింట్ ఆపరేషన్ చేపట్టి గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు.
Hyderabad | ఒడిశా నుంచి..
నగరంలో గంజాయి, డ్రగ్స్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. విద్యార్థుల నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద డాక్టర్లు, వ్యాపారుల వరకు వీటికి బానిసలుగా మారారు. నగరంలో డ్రగ్స్ విక్రయాలతో పాటు నగరం మీదుగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. తాజాగా ఒడిశా (Odisha) నుంచి రాజస్థాన్ (Rajasthan)కు తరలిస్తున్న గంజాయిని పోలీసులు అబ్దుల్లాపూర్మెట్లో పట్టుకున్నారు. దాని విలువ రూ.6 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.
Hyderabad | సిమెంట్ బస్తాల ముసుగులో..
నిందితులు డీసీఎం వ్యాన్లో సిమెంట్ బస్తాల మధ్య గంజాయి దాచి తీసుకెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. డీసీఎంలో తనిఖీలు చేపట్టగా.. 1,210 కిలోల గంజాయి దొరికిందన్నారు. నిందితులను అరెస్ట్ చేసి డీసీఎంను పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా నగరంలో ఇటీవల భారీగా డ్రగ్స్, గంజాయి దొరుకుతుండటం ఆందోళన కలిగిస్తోంది.