అక్షరటుడే, వెబ్డెస్క్ : Shamshabad Airport | శంషాబాద్ ఎయిర్ పోర్టులో అధికారులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. రూ.4.5 కోట్ల విలువైన 4.15 కిలోల హైడ్రో పోనిక్స్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
నగరంలో గంజాయి దందా ఆగడం లేదు. పోలీసులు, అధికారులు ఎన్ని చర్యలు చేపట్టిన స్మగ్లర్లు దందా చేస్తూనే ఉన్నారు. ఇతర ప్రాంతాల నుంచి గంజాయి, డ్రగ్స్ (Drugs) తీసుకొని హైదరాబాద్లో (Hyderabad) విక్రయాలు చేపడుతున్నారు. విద్యార్థులు, యువత వీటికి బానిసలుగా మారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో (Shamshabad Airport) అధికారులు ఓ ప్రయాణికుడి వద్ద గంజాయి పట్టుకున్నారు.
Shamshabad Airport | సూట్కేస్ రహస్య పొరలో..
బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద డీఆర్ఐ అధికారులు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అధికారులకు దొరకకుండా ప్రత్యేకంగా తయారు చేసిన సూట్కేసులో డ్రగ్స్ తీసుకొచ్చాడు. సూట్కేస్ లోపలి పొరలో గంజాయి తీసుకురాగా.. చెకింగ్ సమయంలో దొరికిపోయాడు. మొత్తం 4.15 కిలోల హైడ్రో పోనిక్స్ గంజాయిని పట్టుకున్నామని, దీని విలువ రూ.4.15 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశామన్నారు.
కాగా నగరంలో నిత్యం గంజాయి, డ్రగ్స్ పట్టుబడుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఈగల్ టీమ్, ఎస్వోటీ పోలీసులు సైతం తనిఖీలు చేపట్టి భారీగా గంజాయి, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. దీంతో తల్లిదండ్రులు కలవర పడుతున్నారు. గంజాయి, డ్రగ్స్పై ఉక్కుపాదం మోపాలని కోరుతున్నారు.
