అక్షరటుడేర, వెబ్డెస్క్: Honeymoon In Shillong | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్యోదంతం త్వరలోనే తెరకెక్కనుంది. ప్రముఖ వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్య ఘటన సినిమాగా రాబోతోంది. ఈ సంచలనాత్మక హత్య కేసు ఆధారంగా సినిమాను రూపొందించేందుకు బాలీవుడ్ దర్శకుడు ఎస్పీ నింబావత్(Bollywood Director SP Nimbawat) సిద్ధమయ్యారు.
‘హనీమూన్ ఇన్ షిల్లాంగ్'(Honeymoon in Shillong) అనే పేరుతో త్వరలోనే తెరకెక్కించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇప్పటికే కథ కూడా సిద్దమైందని, ఈ చిత్రం 80 శాతం ఇండోర్లో, మిగిలిన భాగాన్ని షిల్లాంగ్ (మేఘాలయ)లో చిత్రీకరించనున్నట్లు తెలిపారు.
Honeymoon In Shillong | దారుణాలు ఆగాలనే..
హనీమూన్ హత్యోదంతంపై సినిమా తీసేందుకు రాజారఘువంశీ కుటుంబ సభ్యులు సమ్మతించారని దర్శకుడు తెలిపారు. ‘హనీమూన్ ఇన్ షిల్లాంగ్’ దర్శకుడు, నిర్మాణ బృందం మంగళవారం రాజా రఘువంశీ ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులతో సుదీర్ఘంగా చర్చించారు. అన్ని ప్రధాన సంఘటనలను సోదరుడు విపిన్ రఘువంశీతో వివరంగా చర్చించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఇలాంటి ఘోరాలు జరగకూడదనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్దమయ్యామని చెప్పారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని చెప్పారు. ఈ కేసులో నిజం వెల్లడి కావాల్సి ఉందని, సినిమా తీసే ఉద్దేశ్యం సత్యాన్ని బయటకు తీసుకురావడమేనని దర్శకుడు నింబావత్ అన్నారు.
సోనమ్ కుటుంబంతో తనకు ఎటువంటి సంబంధం లేదని, ఈ చిత్రం పూర్తిగా రాజా జీవితం. ఈ బాధాకరమైన హనీమూన్ హత్య (Honeymoon Murder) రహస్యంపై దృష్టి సారిస్తుందని వివరించారు. నటీనటుల ఎంపిక చేయలేదని, ముంబైకి వెళ్లాక నటీనటులను ఎంపిక చేస్తామన్నారు. అయితే, ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ (Bollywood Star) నటించే అవకాశం ఉందని ఆయన ప్రస్తావించారు. మరోవైపు, ఈ సినిమా ద్వారా తమ సోదరుడి హత్యలో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనేది ప్రజలు తెలుసుకుంటారని రాజా సోదరుడు సచిన్ పేర్కొన్నారు.
Honeymoon In Shillong | హనీమూన్కు తీసుకెళ్లి హత్య..
మధ్యప్రదేశ్లోని (Madhya Pradesh) ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్ మే 11న ఘనంగా వివాహం చేసుకున్నారు. పెళ్లి జరిగిన 9 రోజుల తర్వాత మే 20న నవ దంపతులు హనీమూన్ కోసం షిల్లాంగ్కు వెళ్లారు. అయితే, మే 23 నుంచి వీరు కనిపించకుండా పోయారు. వారి జాడ లేకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగారు.
ఈ క్రమంలో జూన్ 2న రాజా మృతదేహాన్ని వీ సావ్డాంగ్ జలపాతంలో (Wee Sawdang Waterfall) లభ్యమైంది. ఆయన మెడపై లోతైన గాయాలు కనిపించడంతో ఇది సాధారణ మరణం కాదని, హత్య అని అనుమానాలు వ్యక్తమయ్యాయి. భార్య సోనమ్ కోసం గాలించగా, ఆమె జూన్ 7న ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని గాజీపూర్లో ప్రత్యక్షమైంది. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా, సంచలన విషయాలు వెలుగు చూశాయి. సోనమ్ తన ప్రేమికుడు రాజ్ కుష్వాహా. ఇతర సహచరులతో కలిసి ఈ హత్యకు కుట్ర పన్నిందని దర్యాప్తులో తేలింది. ఈ కేసులో సోనమ్, ఆమె ప్రేమికుడు రాజ్ సహా ఎనిమిది మందిని అరెస్టు చేశారు.