అక్షరటుడే, హైదరాబాద్: Schools Holidays : భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన దృష్ట్యా విద్యాశాఖ ఐదు జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. నేడు(బుధవారం, ఆగస్టు 13), రేపు(గురువారం) సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Schools Holidays : ఈ జిల్లాల్లో అలెర్ట్..
వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఈమేరకు ఈ జిల్లాల్లో బుధ, గురువారాల్లో పాఠశాలకు సెలవులు ప్రకటించింది.
భారీ వర్షాల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ తగు చర్యలు చేపట్టారు. హైడ్రా అధికారుల సూచన మేరకు బుధ, గురువారాల్లో ఒంటిపూట బడులు నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు.
మరోవైపు భారీ వర్ష సూచన నేపథ్యంలో అధికారులను సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. రానున్న మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో అధికార యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్తో పాటు భారీ వర్షాలు, వరద ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ఆస్తి, ప్రాణ నష్టం జరక్కుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
రానున్న 72 గంటల్లో పలు జిల్లాలతో పాటు హైదరాబాద్లో (Hyderabad) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (Meteorological Department) సూచనల నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్(Command Control Center) నుంచి ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తం చేశారు. రానున్న పరిస్థితులను ఎదుర్కొనడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
రాబోయే మూడు రోజులు కీలకంగా మారినందున అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సెలవులను రద్దు చేయాలన్నారు. 24 గంటలు అందుబాటులో ఉండాలన్నారు. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరకుండా, పశు సంపదకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
నగరంలో శిథిలావస్థలో ఉన్న భవనాలున్నాయి. జోనల్ కమిషనర్లను అప్రమత్తమై అలాంటి చోట ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు. భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు సంభవించినప్పుడు ఎయిర్ లిఫ్టింగ్ చేసేందుకు అవసరమైన హెలికాప్టర్స్ ఉండేలా చూసుకోవాలన్నారు. NDRF సిబ్బందితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు.
హైడ్రా 24 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగంలో 2 వేల మందికి శిక్షణ ఇచ్చామని చెప్పారు. సహాయక చర్యల కోసం ఎక్కడ అవసరమైతే వారిని అక్కడికి తరలించాలన్నారు.
విద్యుత్ అంతరాయం ఏర్పడితే తక్షణం పునరుద్దరణ పనులు చేపట్టాలన్నారు. మొబైల్ ట్రాన్స్ఫార్మర్స్, అవసరమైతే జనరేటర్స్ను సమకూర్చాలని పేర్కొన్నారు. విద్యుత్కు సంబంధించి అత్యవసర సమయాల్లో ఉపయోగించుకునేందుకు వీలుగా మొబైల్ ట్రాన్స్ఫార్మర్స్ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా, అలాగే పట్టణాల్లో డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అత్యవసర సమయాల్లో అవసరమైన మెడిసిన్స్, సౌకర్యాలను అన్నింటినీ సిద్ధం చేసుకోవాలి.