అక్షరటుడే, వెబ్డెస్క్ : Group-1 Exams | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్–1 పరీక్షల(Group-1 )పై సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది.
తెలంగాణ(Telangana) ఏర్పడిన తర్వాత తొలిసారి గ్రూప్–1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. అయితే రెండు సార్లు ప్రిలిమ్స్ పరీక్ష రద్దు అయింది. తర్వాత మూడోసారి ప్రిలిమ్స్ విజయవంతంగా పూర్తియింది. మెయిన్స్ పరీక్షలు నిర్వహించిన టీజీపీఎస్సీ ఫలితాలను(TGPSC Results) విడుదల చేసి, అభ్యర్థులను సైతం ఎంపిక చేసింది.
Group-1 Exams | కోర్టును ఆశ్రయించడంతో..
గ్రూప్–1 ఫలితాల(Group 1 Results)పై కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. మూల్యాంకనం సక్రమంగా జరగలేదని వారు ఆరోపించారు. దీంతో ఏకసభ్య ధర్మాసనం దీనిపై విచారించి ఇటీవల కీలక తీర్పు వెలువరించింది. గ్రూప్–1 ఫలితాలు, ర్యాంకులను రద్దు చేసింది. అంతేగాకుండా మళ్లీ మూల్యాంకనం చేయాలని, లేదంటే.. పరీక్ష రద్దు చేసి కొత్తగా పెట్టాలని ఆదేశించింది.
Group-1 Exams | సవాల్ చేసిన టీజీపీఎస్సీ
గ్రూప్–1 పరీక్షలపై సింగిల్ బెంచ్ తీర్పును టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్ ఎదుట సవాల్ చేసింది. గ్రూప్–1లో ర్యాంకులు సాధించిన వారు సైతం కోర్టున(High Court) ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై బుధవారం వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధించింది. విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేస్తూ తీర్పు చెప్పింది. దీంతో ర్యాంకు సాధించిన అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. తుది తీర్పునకు లోబడి నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.