HomeతెలంగాణOperation Kagar | భద్రాద్రి ఏజెన్సీలో హై అలెర్ట్​.. పోలీసుల కూంబింగ్​

Operation Kagar | భద్రాద్రి ఏజెన్సీలో హై అలెర్ట్​.. పోలీసుల కూంబింగ్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Operation Kagar | భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో హై అలెర్ట్​ నెలకొంది. అడవుల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో పోలీసులు కూంబింగ్​ చేపట్టారు. మణుగూరు, పినపాక, కరకగూడెం, అశ్వాపురం, బూర్గంపాడు మండలాల్లో సోదాలు చేస్తున్నారు. తాడ్వాయి, కరకగూడెం, కిన్నెరసాని అడవుల్లో సైతం సెర్చ్​ ఆపరేషన్(Search Operation)​ కొనసాగుతోంది. గిరిజన గ్రామాలను బలగాలు జల్లెడ పడుతున్నాయి. దీంతో ఆదివాసీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

దేశంలో 2026 మార్చి 31 వరకు మావోయిస్టులు(Maoists) లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా ప్రకటించారు. ప్రతి వర్షాకాలంలో మావోలు రెస్ట్​ తీసుకుంటారని.. అయితే ఈ సారి వారికి నిద్ర లేకుండా చేస్తామని ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆపరేషన్​ కగార్(Operation Kagar)​లో భాగంగా బలగాలు సెర్చ్​ ఆపరేషన్​ కొనసాగిస్తున్నాయి.

సాధారణంగా వానాకాలంలో అడవుల్లో వాగులు, నదులు పారుతాయి. చెట్లు, పొదలు విపరీతంగా పెరిగి దట్టంగా కనిపిస్తాయి. ఈ క్రమంలో బలగాలకు కూంబింగ్​కు అనుకూల పరిస్థితులు ఉండవు. దీంతో ప్రతి ఏటా మావోయిస్టులు వాతావరణ పరిస్థితులను అనుకూలంగా మార్చుకొని రెస్ట్​ తీసుకునే వారు. అయితే ఈ ఏడాది వానాకాలంలో సైతం ఆపరేషన్​ కగార్​ కొనసాగించి మావోల ఆట కట్టిస్తామని అమిత్​ షా(Amit Shah) ప్రకటించారు. ఇందులో భాగంగా నిత్యం అడవులను జల్లెడ పడుతున్నారు.

Operation Kagar | కర్రెగుట్టల్లో తనిఖీలు మరవక ముందే..

తెలంగాణలోని ములుగు జిల్లా(Mulugu District) సరిహద్దులో గల కర్రెగుట్టల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు ఏప్రిల్​లో వేల సంఖ్యలో భద్రతా బలగాలు ఆపరేషన్​ చేపట్టాయి. కర్రెగుట్టలను చుట్టుముట్టి స్వాధీనం చేసుకున్నాయి. ఈ క్రమంలో జరిగిన ఎన్​కౌంటర్లలో పలువురు మావోయిస్టులు మృతి చెందారు. మావోల బంకర్లను బలగాలు గుర్తించి, ధ్వంసం చేశాయి. భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. తాజాగా భద్రాద్రి ఏజెన్సీలో మావోయిస్టుల కోసం కూంబింగ్(Coombing)​ చేపడుతుండడం గమనార్హం.