అక్షరటుడే, వెబ్డెస్క్: Heavy rains | రాష్ట్రంలో భారీ నుంచి అతి వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాలో బుధవారం కుండపోత వర్షాలు కురిశాయి. కామారెడ్డి జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. గత 36 గంటల్లో 500-600 మి.మీ. వర్షం కురిసింది. భారీ వర్షాలు జల విలయం సృష్టించాయి. ఈ జిల్లాలో అనేక చోట్ల రోడ్లు తెగిపోయాయి. నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కామారెడ్డి పట్టణంలోని జీఆర్ కాలనీలో భారీ వరద నీరు నిలిచిపోయింది. ఓ ఇంట్లో ముగ్గురు చిక్కుకుపోవడంతో బుధవారం రాత్రి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి పరిస్థితిని సమీక్షించారు. అధికారులు, సిబ్బంది కలిసి వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. పాల్వంచ వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. నేషనల్ హైవే 44పై బుధవారం భారీ వరద రావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాత్రి సమయంలో నిజామాబాద్ సీపీ సాయిచైతన్య, కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర పరిస్థితిని సమీక్షించారు. 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అయ్యింది.
Heavy rains | ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండడంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. రానున్న ఆరు గంటల పాటు కుండపోత వర్షాలు కురవనున్నాయి. అంతేకాకుండా కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ములుగు, జగిత్యాల, మహబూబాబాద్ లలో కూడా రాబోయే కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, సంగారెడ్డి, వికారాబాద్, భద్రాద్రి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇక హైదరాబాద్లో రాబోయే 6 గంటలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.