అక్షరటుడే, వెబ్డెస్క్: Musi River | గత కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో హైదరాబాద్లోని ముసీ నది (Hyderabad Musi River) తీర ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. భారీ వరద ప్రవాహంతో నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి.
ముఖ్యంగా చంచల్గూడ, బండ్లగూడ జాగీర్, నార్సింగి, రాజేంద్రనగర్ వంటి దిగువ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. నగర రవాణా కేంద్రంగా ఉన్న ఎంజీబీఎస్ బస్టాండ్ (MGBS bus stand) సైతం మూసీ నీటి వలన సగం మునిగింది. చాదర్ ఘాట్ లోలెవల్ వంతెనపై (Chadar Ghat low-level bridge) ఆరు అడుగులు, మూసారాంబాగ్ వంతెనపై పది అడుగుల మేర నీరు ప్రవహించింది. దీంతో బస్టాండ్లోకి భారీగా నీరు చేరి, బస్సులు నిలిచిపోయాయి.
Musi River | భారీ వర్షాలతో..
ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక హిమాయత్ సాగర్ (Himayat Sagar) మరియు ఉస్మాన్ సాగర్ జలాశయాలు పూర్తిగా నిండడంతో అధికారులు గేట్లను ఎత్తి వరదనీటిని మూసీ ద్వారా విడుదల చేశారు.
గురువారం రాత్రి వరకు 13,500 క్యూసెక్కులు, తరువాత రాత్రి 8 తర్వాత 35,000 క్యూసెక్కుల వరదనీరు విడుదల చేయడంతో మూసీ తీర ప్రాంతాలన్నీ ముంపుకు గురయ్యాయి. ముసారాంబాగ్ వంతెన నిర్మాణ పనుల సమయంలో ఉపయోగించిన సామాను వరదకి కొట్టుకుపోయింది. దీని ఫలితంగా పురానాపూల్–కుల్సుంపుర, చాదర్ ఘాట్ కాజ్వే, మూసారాంబాగ్ బ్రిడ్జి (Musarambagh Bridge) లాంటి ప్రధాన రహదారులను పూర్తిగా మూసివేశారు.
మూసీకి ఇరువైపులా ఉన్న మొయినాబాద్, శంషాబాద్, షాబాద్, శంకర్పల్లి, గండిపేట మండలాల రైతులకు పెద్ద నష్టం వాటిల్లింది. వరదనీటిలో పంట పొలాలు పూర్తిగా మునిగి, రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశాల మేరకు ఆర్అండ్ఆర్ టీం, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఎంజీబీఎస్లో MGBS చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసుకువచ్చేందుకు ప్రత్యేక బృందాలను మోహరించారు. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లోనూ రోడ్లపై నీరు నిలిచిపోయింది. బల్దియా అధికారులు మోటార్ల సహాయంతో నీటిని తొలగిస్తున్నారు.