అక్షరటుడే, వెబ్డెస్క్ : Earthquake | దేశ రాజధాని ఢిల్లీవాసులు ఓ వైపు వర్షాలతో ఇబ్బందులు పడుతుండగా.. మరోవైపు భూకంపం చోటు చేసుకుంది. ఢిల్లీ(Delhi), ఎన్సీఆర్ ప్రాంతంలో గురువారం ఉదయం భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.1గా నమోదు అయింది. నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్. ఇతర పరిసర ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించాయి. హర్యానాలోని ఝజ్జర్(Haryana Jhajjar)కు ఈశాన్యంగా 4 కి.మీ దూరంలో. 14 కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఉత్తర భారతంలోని రాజస్థాన్, హర్యానా, ఉత్తర ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. అయితే భూకంపంతో జరిగిన నష్టంపై వివరాలు తెలియాల్సి ఉంది.
Earthquake | జనం పరుగులు
భూ ప్రకంపనలతో(Earthquakes) ప్రజలు భయాందోళనకు గురయ్యారు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లోని ఇండ్లలో ఫ్యాన్లు, ఇతర గృహోపకరణాలు ఊగడం గమనించిన స్థానికులు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఝజ్జర్లోని భూకంప కేంద్రం నుంచి దాదాపు 200 కి.మీ దూరంలో పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని మీరట్(Western Uttar Pradesh Meerat). షామ్లీ వరకు కూడా బలమైన ప్రకంపనలు సంభవించాయి.
Earthquake | బలమైన ప్రకంపనలు కాదు..
భూమి ఉపరితలం నుంచి దాదాపు 10 కి.మీ దిగువన భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఆఫ్ సీస్మోలజీ(National Center of Seismology) పేర్కొంది. భూకంప తీవ్రత అంతగా లేకపోవడంతో ఢిల్లీ-NCRలో పెద్ద నష్టం జరగలేదని తెలిపింది. భూకంప క్రియాశీల ప్రాంతాల జోన్ IVలోకి వచ్చే ఢిల్లీలో అప్పుడప్పుడు ప్రకంపనలు వస్తుంటాయి. ఇటీవలి కాలంలో ఢిల్లీ-NCRలో అనేకసార్లు 4.0 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి. మంగళవారం ఉదయం అస్సాంలోని కర్బి ఆంగ్లాంగ్ జిల్లాలో రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రతతో మరో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ నివేదించింది.
Earthquake | వణికిస్తున్న వర్షాలు
ఢిల్లీ వాసులు ఇప్పటికే వర్షాలతో వణికి పోతున్నారు. బుధవారం సాయంత్రం నుంచి హస్తినాలో భారీ వర్షం(Heavy Rains) కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఢిల్లీ రోడ్లు అయితే చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం ఉదయం కార్యాలయాలకు వెళ్లేవారు గంటల కొద్ది ట్రాఫిక్లో చిక్కుకుపోయారు.
Earthquake | రెడ్ అలెర్ట్ జారీ
ఢిల్లీలో బుధవారం సాయంత్రం నుంచి గురువారం తెల్లవారు జాము వరకు వాన దంచికొట్టింది. దీంతో రోడ్లపై మోకాలి లోతులో నీరు నిలిచింది. ఢిల్లీ వాసులు వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలతో విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. మరోవైపు గురు, శుక్రవారాల్లో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Meteorological Department) రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.