అక్షరటుడే, వెబ్డెస్క్ : Weather Updates | అల్ప పీడన (LPA) ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజులుగా వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో కుండపోత వానలు పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు మాత్రమే కురుస్తున్నాయి. శుక్రవారం కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా రాత్రిపూట వాన దంచి కొట్టనుంది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు (Moderate Rains) కురుస్తాయి.
Weather Updates | హైదరాబాద్ నగరంలో..
హైదరాబాద్ (Hyderabad) నగరంలో శుక్రవారం మధ్యాహ్నం వరకు వర్షాలు పడే అవకాశం లేదు. సాయంత్రం, రాత్రిపూట మోస్తరు వర్షాలు పడుతాయి. కొన్ని ప్రాంతాల్లో 15 మి.మీ. నుంచి 40 మి.మీ. వర్షపాతం నమోదు కావొచ్చు. గురువారం సైతం నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. హిమాయత్సాగర్కు భారీగా వరద వస్తుండటంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నగర శివారులోని అప్పా జంక్షన్–నార్సింగ్ మార్గంలో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై గురువారం రాత్రి పెద్ద బండరాళ్లు కొండపై నుంచి జారి వచ్చాయి.
Weather Updates | చిలిప్చెడ్లో అత్యధికం
వాతావరణ శాఖ గురువారం పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు పలు ప్రాంతాల్లో వానలు దంచికొట్టాయి. మెదక్, సంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. మెదక్ జిల్లా చిలిప్చెడ్లో అత్యధికంగా 146 మి.మీ. వర్షపాతం నమోదు అయింది. సంగారెడ్డి జిల్లా వట్పల్లిలో 135, నిజామాబాద్ జిల్లా రుద్రూర్లో 125, మెదక్ జిల్లా కౌడిపల్లిలో 109మి.మీ. వర్షం కురిసింది.