అక్షరటుడే, వెబ్డెస్క్ : Rivers | తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నదులైన గోదావరి (Godavari), కృష్ణ (Krishna)లకు భారీగా వరద వస్తోంది. ఆయా నదులపై గల అన్ని ప్రాజెక్టుల గేట్లు తెరిచి లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.
కృష్ణానదిపై గల జూరాల ప్రాజెక్ట్కు 2 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో అధికారులు 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు విద్యుత్ ఉత్పత్తి ద్వారా కూడా నీటిని వదులుతున్నారు. దీంతో శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. 2,33,202 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా అధికారులు 8 గేట్లు 10 అడుగులు ఎత్తారు. కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది. నాగార్జున సాగర్ (Nagarjuna Sagar)కు 2,05,796 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. అధికారులు 20 గేట్లను ఓపెన్ చేశారు. పులిచింతల డ్యామ్ గేట్లు సైతం ఎత్తడంతో ప్రకాశం బ్యారేజీ (Prakasham Barrage) నుంచి లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళ్తోంది.
Rivers | బంగాళాఖాతంలోకి 2,900 టీఎంసీలు
ఈ ఏడాది గోదావరికి భారీగా వరద వస్తోంది. దీంతో ఆ నదిపై గల అన్ని ప్రాజెక్ట్లు నిండాయి. మొదట్లో గోదావరికి ఎగువన ప్రవాహం లేక శ్రీరామ్సాగర్ ప్రాజెక్ట్ వెలవెలబోయింది. అయితే దిగువన కాళేశ్వరం వద్ద మాత్రం వానాకాలం ప్రారంభం నుంచే గోదావరికి భారీగా ప్రవాహం మొదలైంది. ఆగస్టు చివరలో కురిసిన భారీ వర్షాలతో ఎగువన సైతం గోదావరి ఉగ్రరూపం దాల్చింది.
గోదావరిపై గల శ్రీరామ్సాగర్ (Sriram Sagar) ప్రాజెక్ట్లోకి ప్రస్తుతం 3,68,226 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. 51,560 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీరామ్ సాగర్ నుంచి వరద కాలువ ద్వారా మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యాంలను సైతం నింపారు. ఎల్లంపల్లి నిండుకుండలా ఉండటంతో ధవళేశ్వరం బ్యారేజీ (Davaleswaram Barrage) ద్వారా లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలో కలుస్తుంది. ఈ సీజన్లో ధవళేశ్వరం బ్యారేజీ ద్వారా 2,900 టీఎంసీలు బంగాళాఖాతంలోకి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఈ బ్యారేజీ నుంచి ప్రతి ఏడాది సాధారణంగా 2,850 టీఎంసీలు నీరు వృథాగా సముద్రంలోకి ప్రవహిస్తుంది. ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ నీరు సముద్రంలో కలిసింది. వరదలు కొనసాగుతుండటంతో 3 వేల టీఎంసీలకు చేరే అవకాశం ఉంది.