అక్షరటుడే, వెబ్డెస్క్: Harish Rao Demands Halt | ఖమ్మం జిల్లా (Khammam District) వెలుగుమట్ల వినోబానగర్ (Vinobanagar)లో అప్పులు చేసి పేదలు నిర్మించుకున్న ఇళ్లను, వేల మంది పోలీసుల పహారాలో కూల్చివేయడం అత్యంత హేయమైన చర్య అని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఇది ప్రజాస్వామ్యమా? లేక పోలీస్ రాజ్యమా? అని ప్రశ్నించారు.
వెలుగుమట్ల (Velugumatla)లో భూదాన్ భూముల్లో ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట నుంచి అదనపు బలగాలు రప్పించారు. ఏడేళ్లుగా భూదాన్ భూముల్లో ఇళ్లు కట్టుకుని దాదాపు 600 మంది నివాసం ఉంటున్నారు. మంగళవారం ఉదయం నుంచి అధికారులు ఆక్రమణలను తొలగిస్తున్నారు. అయితే పలువురు బాధితులు జేసీబీలకు అడ్డం పడుకొని ఆందోళన చేశారు. బాధితులను పోలీసులు పక్కకు పంపించారు. ఈ ఘటనపై హరీశ్రావు (Harish Rao) ఎక్స్ వేదికగా స్పందించారు.
Harish Rao Demands Halt | చీకటి పనులు చేసేవారు..
నాలుగు జిల్లాల నుంచి వేల మంది పోలీసులను మోహరించి, యుద్ధ వాతావరణాన్ని సృష్టించి పేదల ఇళ్లను కూల్చాల్సిన అవసరం ఏమొచ్చిందని మాజీ మంత్రి ప్రశ్నించారు. పేద ప్రజలు తీవ్రవాదుల్లా కనిపిస్తున్నారా అన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని మీడియాను రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. చీకటి పనులు చేసేవారే మీడియాను చూసి భయపడతారన్నారు. అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి.. నేడు ఉన్న ఇళ్లను కూలగొట్టి పేదలను నడిరోడ్డుపై నిలబెడుతున్నారని మండిపడ్డారు.
Harish Rao Demands Halt | ప్రత్యామ్నాయం చూపాలి
ఎంతో కష్టపడి కట్టుకున్న ఇళ్లను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ప్రత్యామ్నాయం చూపకుండా కూల్చడం అమానుషమని ఆయన అన్నారు. వెంటనే అక్రమ కూల్చివేతలను ఆపాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ (BRS Party) అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపకుండా ఇంచు భూమి కూడా కదిలించడానికి వీల్లేదన్నారు.
