అక్షరటుడే, వెబ్డెస్క్ : Harish Rao contractor payments | రాష్ట్ర ప్రభుత్వం చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. కమీషన్ల కోసం బడా కాంట్రాక్టర్లకు రాత్రికి రాత్రే కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నారని ఆరోపించారు.
రెండున్నరేళ్లుగా తమకు బిల్లులు రావడం లేదని మన ఊరు మన బడి సివిల్ కాంట్రాక్టర్లు సోమవారం హరీశ్రావును కలిసి వినతి పత్రం అందించారు. కేసీఆర్ (KCR) ప్రభుత్వంలో పేద విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి పనులకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించామన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అధికారంలోకి వచ్చాక 1500 మంది చిన్న కాంట్రాక్టర్లకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని విమర్శించారు. అప్పులు తెచ్చి పనులు చేసిన వారు నేడు మిత్తీలు కట్టలేక రోడ్డున పడ్డారన్నారు.
Harish Rao contractor payments | అక్రమ కేసులు
చిన్న కాంట్రాక్టర్లకు పైసల్లేవంటున్న ప్రభుత్వం.. పెయింటింగ్, బెంచీలు సరఫరా చేసిన బడా కంపెనీలకు మాత్రం రాత్రికి రాత్రే వందల కోట్లు ఎలా విడుదల చేసిందని ప్రశ్నించారు. తమ బిల్లుల కోసం కాంట్రాక్టర్లు ప్రజావాణిలో మొరపెట్టుకున్నా, విద్యాశాఖ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదన్నారు. సచివాలయంలో ఆర్థిక మంత్రి చాంబర్ ఎదుట శాంతియుతంగా నిరసన తెలిపితే.. వారిపై అక్రమ కేసులు బనాయించడం సరికాదన్నారు.
మన ఊరు – మన బడి కోసం ఆర్థిక శాఖ నుంచి విద్యాశాఖకు వచ్చిన నిధులనైనా.. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న సివిల్ కాంట్రాక్టర్లకు చెల్లిస్తారా? లేక ఆ డబ్బును కూడా కూడా బడా కాంట్రాక్టర్లకే కట్టబెడతారా అని ఆయన ప్రశ్నించారు. పేద పిల్లల కోసం పాఠశాలలు బాగుచేసిన చిన్న కాంట్రాక్టర్లను ఇబ్బందులు పెట్టొద్దన్నారు. వెంటనే 1500 మందికి పెండింగ్ బిల్లులను విడుదల చేసి, వారిపై పెట్టిన అక్రమ కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
