అక్షరటుడే, వెబ్డెస్క్ : Hanuman Movie | తెలుగు సినిమా పరిశ్రమలో మరోసారి దుమారం రేగింది. పాన్ ఇండియా స్థాయిలో బంపర్ హిట్ అయిన ‘హను-మాన్’ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య మొదలైన వివాదం రచ్చకెక్కింది.
ఇప్పటికే తీవ్రమైన ఆరోపణలు, ఉత్తర, ప్రత్యుత్తరాలు వెలుగులోకి రాగా, ఈ వివాదం తాజాగా తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వద్దకు చేరింది. ప్రశాంత్ వర్మ (Director Prashanth Varma)పై సోషల్ మీడియాలో అనేక వార్తలు వైరల్ అవుతున్న సమయంలో ప్రైమ్షో బ్యానర్ నిరంజన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆరు పేజీల లేఖను విడుదల చేయడం కలకలం రేపింది. ప్రశాంత్ వర్మ తమతో ముందుగా చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘించి మోసపూరిత చర్యలకు పాల్పడి, తమ సంస్థకు రూ.20.57 కోట్ల ఆర్థిక నష్టం కలిగించారని ఫిర్యాదులో పేర్కొంది.
Hanuman Movie | నిబంధనలు ఉల్లంఘించి..
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన “హనుమాన్” సినిమా విజయం జాతీయ స్థాయిలో బంపర్ హిట్ అయింది. అయితే ఇప్పుడా సినిమాకు సంబంధించి సరికొత్త వివాదం రాజుకుంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డి (Producer Niranjan Reddy) మధ్య తీవ్ర ఆర్థిక విభేదాలు తలెత్తగా, ఆ వివాదం ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ కు చేరింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ తన “సినిమాటిక్ యూనివర్స్”లో భాగంగా ఉన్న అధీర, జై హనుమాన్ వంటి సినిమాల కోసం రూ.10.23 కోట్లకు పైగా అడ్వాన్స్ తీసుకున్నారని, కానీ ఆ ప్రాజెక్టులు తమ సంస్థలోనే చేయాలనే ఒప్పందాన్ని ఇప్పుడు వర్మ ఉల్లంఘించారని నిర్మాత నిరంజన్ రెడ్డి ఆరోపించారు. తమ ప్రైమ్షో బ్యానర్ (Prime Show Banner)లో బ్యానర్లో నాలుగు సినిమాలు అధిరా, మహాకాళి, జై హనుమాన్, బ్రహ్మ రక్షస్, ఆక్టోపస్ చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారని నిరంజన్ రెడ్డి తెలిపారు.
కానీ నిబంధనలు ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు. “ఆక్టోపస్” సినిమా కోసం వర్మ తమను వేరే ప్రొడ్యూసర్ నుంచి హక్కులు కొనిపించాడని, భారీ ఖర్చులు పెట్టించాక ఎన్వోసీ ఇవ్వలేదని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. దీనివల్ల తాము భారీగా నష్టపోయామని, ముఖ్యంగా జై హనుమాన్ (Hanuman Movie) ప్రాజెక్ట్ వల్లే సుమారు రూ.100 కోట్లు, మొత్తం రూ.200 కోట్ల వరకు వ్యాపార నష్టం జరిగిందని, ఆ మొత్తాన్ని వర్మ నుంచి వసూలు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే.. తమ వద్ద డబ్బు తీసుకున్న ప్రశాంత్ వర్మ ఒప్పందం ప్రకారం మా బ్యానర్లో సినిమా చేయకుండా ఇతర నిర్మాణ సంస్థలతో సినిమాలు ప్రకటించడం అన్యాయమని, ఆ ఐదు సినిమాలకు సంబంధించి నష్ట పరిహారం కింద రూ.200 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోరారు.
Hanuman Movie | కొట్టిపడేసిన వర్మ..
అయితే, నిర్మాత ఆరోపణలను దర్శకుడు ప్రశాంత్ వర్మ కొట్టిపడేశారు. తాను తీసుకున్నది ఎలాంటి అడ్వాన్స్ కాదని, అది హనుమాన్ సినిమా లాభాల్లో తనకు చట్టబద్ధంగా రావాల్సిన వాటా మాత్రమేనని స్పష్టం చేశారు. తనకు వచ్చింది కేవలం రూ.15.82 కోట్లు మాత్రమేనని, అది నేను దర్శకత్వం వహించినందుకు ఇచ్చిన ఫీ, లాభాల వాటా మాత్రమేనని వర్మ తేల్చి చెప్పారు. భవిష్యత్ సినిమాల కోసం ఎలాంటి ఒప్పందాలు లేవని, ఆక్టోపస్ సినిమా వ్యవహారానికి తనకు సంబంధం లేదన్నారు. తనకు రావాల్సిన డబ్బులు చెల్లించకుండా తప్పించుకునేందుకే నిర్మాత ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.
