అక్షరటుడే, వెబ్డెస్క్ : Group 1 | గ్రూప్ – వన్ పరీక్షల సందర్భంగా భారీగా అవకతవకలు జరిగాయని మాజీ మంత్రి హరీశ్రావు (Former Minister Harish Rao) అన్నారు. ఒక్కో ఉద్యోగానికి మంత్రులు, అధికారులు లక్షల రూపాయలు నిరుద్యోగుల వద్ద లంచం అడిగారని చెబుతున్నారని, ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం తప్పును సరిదిద్దుకోకుండా మరోసారి అప్పీల్ కి వెళ్లాలని ప్రభుత్వం భావించడం సిగ్గుచేటన్నారు. శనివారం సిద్దిపేటలో నిర్వహించిన మెగా జాబ్ మేళా (mega job fair) కార్యక్రమంలో హరీశ్రావు మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress Party) నిరుద్యోగులను మోసం చేసిందని మండిపడ్డారు.
Group 1 | సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి..
రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హరీశ్రావు తెలిపారు. ప్రభుత్వ చేతగానితనం వల్లే గ్రూప్1 పరీక్షల్లో (Group 1 examinations) గందరగోళం ఏర్పడిందన్నారు. గ్రూప్ వన్ ఉద్యోగాల (Group One jobs) కోసం మంత్రులు, అధికారులు లంచం అడిగారని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇంత నిర్లక్ష్యంగా పరీక్ష నిర్వహిస్తారా అని స్వయంగా హైకోర్టు ప్రభుత్వంపై మొట్టికాయలు వేసిందని గుర్తు చేశారు. నిజంగా తప్పు చేయకపోతే ముఖ్యమంత్రి సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. అవినీతికి పాల్పడ్డ వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.
Group 1 | సిగ్గులేకుండా అప్పీల్కు వెళ్తారా?
ప్రభుత్వం తప్పును సరిదిద్దకుండా మరో అప్పీల్ కు వెళ్లాలని నిర్ణయించడం సిగ్గు చేటని మండిపడ్డారు. తప్పు జరిగిందని కండ్ల ముందర కనిపిస్తుంటే, కోర్టు కూడా అదే విషయం చెబుతుంటే ఇంకా మళ్లీ అప్పీలుకు వెళ్లడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు (government jobs) ఇస్తామన్నారు. రెండేళ్లు పూర్తకావస్తున్నాఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. 2 లక్షలు ఉద్యోగాలు ఏమయ్యాయో రేవంత్ రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్గాంధీని అశోక్నగర్ చౌరస్తాలో కూర్చోబెట్టి మాటిచ్చారు.. ఆ హామీ ఏమైందని నిలదీశారు.
Group 1 | నోటిఫికేషన్లు ఇచ్చింది మేమే..
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) నియామక పత్రాలు ఇచ్చాడని హరీశ్రావు తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్ వేసింది కేసీఆర్. పరీక్ష నిర్వహించిందీ కేసీఆర్ (KCR). ఇంటర్వ్యూలు జరిగింది కేసీఆర్ హయాంలోనే… కేవలం ఉద్యోగ పత్రాలు ఇచ్చింది మాత్రం రేవంత్ రెడ్డి అని తెలిపారు. అసెంబ్లీలో గట్టిగా నిలదీస్తే చర్చ పెట్టకుండా ఒక అంశాన్ని బట్టి జాబ్ క్యాలెండర్ అని పారిపోయారన్నారు. అది జాబ్ క్యాలెండర్ (job calendar) కాదు జాబ్ లెస్ క్యాలెండర్ అని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ భృతి ఇస్తామని హుస్నాబాద్ సభలో ప్రియాంక గాంధీతో చెప్పించారు. రెండేళ్లు అయింది. నిరుద్యోగ భృతి ఒక్కరికైనా ఇచ్చారా? అని నిలదీశారు. ప్రభుత్వం నిరుద్యోగ యువతని పూర్తిగా మోసం చేసిందన్నారు.