అక్షరటుడే, వెబ్డెస్క్ : Tax Notice | కిరాణ దుకాణం నడుపుతున్న ఓ వ్యక్తికి రూ.141 కోట్లకు పైగా పన్ను నోటీస్ వచ్చింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లో (Uttar Pradesh) చోటు చేసుకుంది.
యూపీలోని బులంద్షహర్ ఏరియాలో సుధీర్ అనే వ్యక్తి కిరాణ షాప్ పెట్టుకొని జీవిస్తున్నాడు. ఆయనకు రూ.141 కోట్లకుపైగా అమ్మకాలపై ఆదాయపు పన్ను అధికారులు నోటీస్లు పంపారు. దీంతో ఆయన షాక్ అయ్యాడు. ఎవరో ఆయన పాన్ కార్డు ఉపయోగించి ఢిల్లీలో ఆరు కంపెనీలను నడుపుతున్నట్లు బాధితుడు గుర్తించాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది.
Tax Notice | గతంలోనూ..
సుధీర్ 2022లో సైతం జీఎస్టీ (GST) కార్యాలయం నుంచి నోటీస్ అందింది. అయితే సదరు సంస్థతో తనకు సంబంధం లేదని అప్పుడే అధికారులకు చెప్పినట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది జులై 10న మళ్లీ రూ.141 కోట్ల అమ్మకాలు చేసినట్లు ఆయనకు నోటీస్ వచ్చింది. అందులో ఆయన ఢిల్లీలో (Delhi) ఆరు కంపెనీలు నడుపుతున్నట్లు ఉండడంతో షాక్ అయ్యాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Tax Notice | ఇతరుల పాన్కార్డులతో..
కొందరు ఆర్థిక నేరగాళ్లు, సైబర్ నేరస్తులు ఇతరుల పాన్ కార్డులతో బ్యాంకు ఖాతాలు, డొల్ల కంపెనీలు తెరుస్తారని అధికారులు తెలిపారు. ఇటీవల వచ్చిన కుబేర సినిమాలో (Kubera Movie) బిచ్చగాళ్ల పేరుతో అకౌంట్లు తీసి మనీలాండరింగ్ చేసిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో ఆధార్ కార్డు, పాన్ కార్డుల సాయంతో కొందరు వ్యక్తులు షెల్ కంపెనీలు తెరుస్తారని అధికారులు పేర్కొన్నారు. వీటితో రుణాలు పొందడం, పన్నులు ఎగవేయడం వంటి పనులు చేస్తారని చెప్పారు.
Tax Notice | జాగ్రత్తగా ఉండాలి
ప్రజలు గుర్తు తెలియని వ్యక్తులకు పాన్, ఆధార్ కార్డు జిరాక్స్లు ఇవ్వొద్దని అధికారులు సూచిస్తున్నారు. అలాగే తమ క్రెడిట్ నివేదికను అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. యూపీకి చెందిన ఓ పారిశుధ్య కార్మికుడికి ఇటీవల రూ.34 కోట్ల పన్ను చెల్లించాలని నోటీసులు వచ్చాయి. పాన్ కార్డు దుర్వినియోగంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.