అక్షరటుడే, హైదరాబాద్: GPO | అవినీతికి పాల్పడుతారని సమాజం ముందు దోషిగా రెవెన్యూ శాఖ మీద పడిన ముద్రను తొలగించుకునే బాధ్యత కొత్తగా నియమితులైన గ్రామ పరిపాలన అధికారులపై ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Chief Minister Revanth Reddy స్పష్టం చేశారు.
పరిపాలన చేయలేరని, అవినీతికి పాల్పడుతారంటూ మీపై జరిగిన ప్రచారం తప్పు.. అని నిరూపించాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కడా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా పని చేయాలని చెప్పారు.
రెవెన్యూ శాఖలో కొత్తగా ఎంపికైన 5,106 మంది గ్రామ పాలనాధికారులు (GPO) లకు హైటెక్స్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలనలో కొలువుల పండుగ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా లాంఛనంగా నియామక పత్రాలు అందించారు.
ఈ సందర్భంగా ఉద్యోగాల్లో నియమితులైన జీపీఓలు అందరితో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి Minister Ponguleti Srinivasa Reddy “భూ సంబంధిత విధి నిర్వహణలో పారదర్శకతతో నిబద్ధతతో న్యాయబద్దంగా పని చేస్తానని” ప్రతిజ్ఞ చేయించారు.
అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కొత్తగా నియమితులైన మీ (Village Administration Officers) పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉందన్నారు.
తెలంగాణలో ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి రావడంలో భాగస్వాములైన మీరు, ఇప్పుడు ఏ చిన్న తప్పు చేసినా ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తుందన్నారు.
భూభారతి Bhu Bharati ని అమలు చేయడమే కాకుండా సాదా బైనామా సక్రమంగా అమలు చేస్తారని హామీ ఇచ్చామని పేర్కొన్నారు.
పేదవాడికి న్యాయం జరగాలంటే గ్రామ పాలనాధికారులు అందుబాటులో ఉండాలని, అందుకు గాను 5 వేల పైచిలుకు గ్రామ పాలనాధికారులను నియమించామని సీఎం తెలిపారు.
సాదా బైనామాకు సంబంధించి ఎనిమిది, తొమ్మిది లక్షల దరఖాస్తులు వచ్చాయని చెబుతున్నారు.. జాగ్రత్తగా పరిష్కరించాలి.. ఇది ఉద్యోగం కాదు.. మీ ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య.. ఇదొక భావోద్వేగమని చెప్పుకొచ్చారు.
తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయులు, ఆర్టీసీ, సింగరేణి, రెవెన్యూ సిబ్బంది అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారని సీఎం గుర్తుచేశారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని సీఎం అన్నారు. పంచాయతీ రాజ్, రెవెన్యూ శాఖల సిబ్బందిని దొంగలుగా, దోషులుగా నిలబెట్టే ప్రయత్నం జరిగిందన్నారు.
తెలంగాణలో భూములకు సంబంధించి ఎన్నో సమస్యలున్నాయి.. ఆ సమస్యలు పరిష్కరించడానికి వీలులేకుండా వీఆర్ఏ, వీఆర్వో, ఎంఆర్వోల నుంచి అధికారాలను తప్పించారని గుర్తుచేశారు.
తద్వారా సమాధానం చెప్పలేక మీరు సమాజంలో దోషులుగా నిలబడే పరిస్థితి కల్పించారని పేర్కొన్నారు. ఎవరో కొందరు తప్పు చేశారని మొత్తం వ్యవస్థనే రద్దు చేస్తారా.. అని ప్రశ్నించారు.
GPO | ధరణి అనే మహమ్మారి…
ఆనాడు ఎవరిని కదిలించినా ఈ ధరణి అనే ఒక భూతం పట్టి పీడించిందని చెప్పారని సీఎం గుర్తుచేశారు. అధికారంలోకి రాగానే ధరణిని బంగాళాఖాతంలో విసిరేసి కొత్త చట్టాలను తెచ్చామన్నారు.
ధరణి అనే మహమ్మారిని అంతం చేయడానికి నిపుణులతో ఒక కమిటీని వేశామని పేర్కొన్నారు. భూభారతి (BhuBharati 2025) చట్టం చేసి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అంకితం చేశామన్నారు.
ధరణి అనే వైరస్ను తప్పించడానికి అనేక రకాల సమాలోచనలు చేశాన్నారు. ఎంతో మంది సలహాలు, సూచనలు తీసుకున్నామన్నారు.
రాష్ట్రంలోని 1 లక్షా 56 వేల ఎకరాల భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేయడమే కాకుండా గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్ది ప్రజలకు అందుబాటులోకి తెచ్చాని సీఎం పేర్కొన్నారు.
భూమికి తెలంగాణ ప్రజలకు విడదీయరాని అనుబంధముందని సీఎం పేర్కొన్నారు. భూమిపై జరిగిన ఏ పోరాటమైనా భూమి సమస్య చుట్టే సాగాయని తెలిపారు.
నిజాంలను, రజాకార్లను, పెత్తందార్లను దిగంతాలకు తరిమికొట్టి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఎన్నో పోరాటాలు జరిగిన చరిత్ర ఉందన్నారు. వీటితో పాటు భూదాన్ ఉద్యమాలు కూడా వచ్చాయన్నారు.
GPO | ల్యాండ్ సీలింగ్ చట్టం
ఇందిరాగాంధీని ఒప్పించి ఆనాడు పీవీ నరసింహారావు ల్యాండ్ సీలింగ్ చట్టం తీసుకొచ్చి 25 లక్షల ఎకరాల భూములను దళితులు, గిరిజనులు, ఆదివాసీలకు పంపిణీ చేశారని గుర్తుచేశారు.
10 లక్షల ఎకరాల పోడు భూములపై ఆదివాసీలకు పట్టాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. తెలంగాణలో మనిషికి భూమితో ఉన్న సంబంధం తల్లికీ బిడ్డకు ఉన్న సంబంధమన్నారు.
తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు 2023 నాటి వరకు చరిత్రను పరిశీలిస్తే భూములను చెరబట్టిన వారిని ప్రజలు దిగంతాల వరకు తరిమికొట్టిన చరిత్ర ఉందని సీఎం పేర్కొన్నారు.
అనంతరం పలువురికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు అందించారు.
కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి ధనసరి అనసూయ సీతక్క, ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి, సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల రావు, ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, పీఏసీ ఛైర్మన్ ఆరికె పూడి గాంధీతో పాటు పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.