అక్షరటుడే, వెబ్డెస్క్ : Rajagopal Reddy | మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాల (Jobs) భర్తీ విషయంలో ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదని ఆయన అన్నారు.
రాజగోపాల్ రెడ్డి కొంతకాలంగా ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy)పై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తనకు మంత్రి పదవి దక్కకపోవడంతో ఆగ్రహంగా ఉన్న ఆయన సీఎంపై విమర్శలు చేస్తున్నారు. పార్టీని ఇరుకున పెట్టేలా మాట్లాడుతున్నారు. ఆర్ఆర్ఆర్ నిర్వాసితులకు న్యాయం జరగడం లేదని ఆయన ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ (RRR) అలైన్మెంట్ మారాలంటే ప్రభుత్వం మారాలేమో అన్నారు. ఆర్ఆర్ఆర్ నిర్వాసితులకు కోసం ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధమని ప్రకటించారు.
Rajagopal Reddy | యువతకు అండగా ఉంటా..
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చిందని రాజగోపాల్రెడ్డి అన్నారు. దీంతో నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని ఆయన చెప్పారు. అయితే ప్రభుత్వం 50 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసిందన్నారు. మిగతా ఉద్యోగాలను సైతం భర్తీ చేయాలని యువత డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. నిరుద్యోగులకు తనకు అండగా ఉంటానన్నారు. యువత ఆశయాల కోసం తాను వారితో ఉంటానని హామీ ఇచ్చారు. నిరుద్యోగులు అధైర్య పడొద్దన్నారు.
Rajagopal Reddy | ప్రభుత్వాలు కూలిపోతాయి
యువత అనుకుంటే ఏదైనా సాధ్యం అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలు సైతం కూలిపోతాయని హెచ్చరించారు. ఇటీవల నేపాల్ (Nepal)లో అవినీతి ప్రభుత్వాన్ని దింపడానికి యువత చేసిన పోరాటాన్ని ప్రపంచం మొత్తం చూసిందన్నారు. నిరుద్యోగులతో పెట్టుకున్న ప్రభుత్వం మనుగడ సాధించలేదని చెప్పారు. నిరుద్యోగులను గాలికి వదిలేయొదన్నారు. వారికి దారి చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రాజగోపాల్రెడ్డి అన్నారు.