అక్షరటుడే, వెబ్డెస్క్ : Visakhapatnam | విశాఖపట్నంలో గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఏర్పాటు చేయబోతున్న డేటా సెంటర్(Data Center) కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది.
మొత్తం రూ.22,002 కోట్లు విలువైన రాయితీలతో ఈ ప్రాజెక్ట్కు ప్రత్యేక ప్రోత్సాహకాలు లభించనున్నాయి. రూ.87,520 కోట్లు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడితో, వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించనున్న ఈ డేటా సెంటర్కు ప్రభుత్వం 480 ఎకరాలను కేటాయించింది.
Visakhapatnam | ప్రత్యేక రాయితీలు..
ప్రత్యేకంగా, కేటాయించిన భూముల విలువలో 25 శాతం రాయితీ ఇవ్వనుంది. అదనంగా 15 ఎకరాలను ల్యాండింగ్ కేబుల్ స్టేషన్ కోసం కేటాయించి, ఆ భూములకు స్టాంప్ డ్యూటీ 100 శాతం మినహాయింపు ప్రకటించింది. ప్లాంట్ మినిషనరీ ఖర్చులో 10 శాతం మూలధన రాయితీ కింద పదేళ్లలో గరిష్ఠంగా రూ.2,129 కోట్లు చెల్లించనుంది.జీపీజీడబ్ల్యూ ఫైబర్ యాక్సెస్(GPGW Fiber Access) కోసం అయ్యే ఖర్చులలో 30 శాతం మొత్తం 20 ఏళ్లలో ప్రభుత్వము చెల్లించనుంది. ఆపరేషన్ యాజమాన్య నిర్వహణ చార్జీలను ప్రతి మూడేళ్లకు 5 శాతం పెంచుతూ రూ.282 కోట్లు చెల్లించే ఏర్పాట్లు చేశారు. డేటా సెంటర్ నిర్మాణం కోసం రూ.2,245 కోట్లు జీఎస్టీ మినహాయింపులో లభించనుంది.
అదనంగా, ఐదేళ్ల పాటు లీజులపై చెల్లించే జీఎస్టీ(GST)ని పూర్తిగా మినహాయిస్తారు, దీని విలువ రూ.1,745 కోట్లు. నీటి చార్జీలపై కూడా పదేళ్లపాటు 25 శాతం రాయితీ అమలులోకి వస్తుంది. ఈ భారీ ప్రోత్సాహకాలు రైడెన్ డేటా సెంటర్ను విజయవంతంగా మరియు వేగవంతంగా నిర్మించడానికి రాష్ట్రానికి ప్రత్యేక ప్రాధాన్యతను ఇచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. రైడెన్ సంస్థకు వివిధ ప్రాంతాల్లో కేటాయించబోయే భూములపై డిస్కౌంట్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Andhra Pradesh Government) అంగీకరించింది. దీనిలో భాగంగా రాంబిల్లి, అడవివరం, ముడసర్లోవలో 160, 120, 200 ఎకరాలుగా మొత్తం 480 ఎకరాలను రాయితీ ధరల్లో కేటాయించనున్నారు.