అక్షరటుడే, వెబ్డెస్క్:RBI | ఆర్బీఐ(RBI) గుడ్ న్యూస్ చెప్పింది. మార్కెట్ అంచనాలకన్నా రెట్టింపు రేట్ కట్(Rate cut) చేసింది. 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంకులనుంచి రుణాలు తీసుకున్నవారిపై ఈఎంఐల భారం తగ్గనుంది.
ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానాలపై మూడు రోజులుగా సమావేశం జరుగుతున్న విషయం తెలిసిందే. గత రెండు సమావేశాల్లోనూ ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరిలో 25 బేసిస్ పాయింట్లు(Basis points) తగ్గించిన ఆర్బీఐ.. ఏప్రిల్లో మరో 25 పాయింట్ల మేర కోత విధించింది. ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నందున ఈసారి నిర్వహిస్తున్న ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్(RBI MPC meeting)కు ప్రాధాన్యత ఏర్పడింది. వరుసగా మూడోసారి కూడా 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తగ్గిస్తారని అందరూ అంచనాలు వేశారు. ఎస్బీఐ(SBI) ఎకనామిక్ రీసెర్స్ డిపార్ట్మెంట్ మాత్రం 50 బేసిస్ పాయింట్లు తగ్గొచ్చని అంచనా వేసింది. వారి అంచనాల మేరకు ఆర్బీఐ రేట్ కట్ ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని ఆర్బీఐ గవర్నర్(RBI Governor) సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో రెపోరేటు 6 శాతంనుంచి 5.5 శాతానికి తగ్గనుంది. ఇది బ్యాంకులలో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు తీసుకున్నవారికి ప్రయోజనం చేకూర్చనుంది. ఆయా రుణాలపై వడ్డీరేటు 7.5 శాతానికి పరిమితం అయ్యే అవకాశాలున్నాయి. ఇది బ్యాంకుల ద్వారా ఆయా రుణాలు పొందినవారికి ఈఎంఐల భారం నుంచి కొంత ఉపశమనం ఇవ్వనుంది.
RBI | అదుపులో ద్రవ్యోల్బణం..
ఈ ఏడాది ఏప్రిల్లో రిటైల్ ఇన్ల్ఫెషన్(Inflation) 3.16 శాతంగా నమోదయ్యింది. ఇది గత ఆరేళ్ల అత్యల్ప స్థాయి. ఆర్బీఐ నిర్దేశించిన 4 శాతం కన్నా తక్కువ కావడంతో ఈసారి కూడా ఆర్బీఐ వడ్డీ రేట్లను కట్ చేస్తుందన్న నమ్మకంతో మార్కెట్ వర్గాలున్నాయి. ద్రవ్యోల్బణం అదుపులో ఉండడంతో వృద్ధికి ప్రోత్సాహం అందించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జంబో రేట్ కట్కు ప్రాధాన్యత ఇచ్చింది. కాగా ఈ ఏడాది మరో రెండు రేట్ కట్లు ఉండొచ్చని భావిస్తున్నారు. దీంతో రెపో రేట్ 5 శాతానికి తగ్గే అవకాశాలున్నాయి.