అక్షరటుడే, వెబ్డెస్క్ : Vande Bharat | రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యార్థం అనేక చర్యలు చేపడుతోంది. ఇప్పటికే వేగంగా వెళ్లడానికి ఆధునిక హంగులతో పలు మార్గాల్లో వందే భారత్ రైళ్లను (Vande Bharat Trains) నడుపుతోంది. వేగంగా గమ్యస్థానాలకు చేరుస్తున్న ఈ రైళ్లలో రద్దీ అధికంగా ఉంటుంది.
వందేభారత్ రైళ్లకు మంచి స్పందన వస్తుండడంతో రైల్వే శాఖ మరిన్ని రైళ్లు అందుబాటులోకి తెస్తోంది. ప్రయాణికుల (Passengers) రద్దీ అధికంగా ఉండే ముఖ్యమైన మార్గాల్లో వీటిని ప్రవేశ పెడుతోంది. ప్రజల వినతుల మేరకు కొన్ని రైళ్లను పొడిగిస్తుండగా.. మరికొన్ని రైళ్ల స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పిస్తోంది. తాజాగా కాచిగూడ నుంచి బెంగళూరు (యశ్వంత్పూర్) మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుపై కీలక ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లోని హిందూపురం (Hindupuram) స్టేషన్లో ఈ రైలుకు హాల్టింగ్ సౌకర్యం కల్పిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ సహాయమంత్రి సోమణ్ణ తెలిపారు.
Vande Bharat | ధర ఎక్కువయినా..
వందే భారత్ రైళ్లు మిగతా ట్రెయిన్లతో పోలిస్తే ప్రత్యేకంగా ఉంటాయి. వేగంగా వెళ్లడంతో పాటు ఇందులో ఆధునిక సౌకర్యాలు ఉంటాయి. దీంతో ధర ఎక్కువయినా వీటిలో ఎక్కడానికి ప్రయాణికులు ఆసక్తి చూపుతున్నారు. ప్రయాణికుల ఆదరణ, రద్దీ మేరకు పలు మార్గాల్లో వందే భారత్ రైళ్ల సంఖ్యను కేంద్రం పెంచుతోంది. తాజాగా కాచిగూడ- యశ్వంత్పూర్ (Kacheguda- Yeshwantpur) వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు హిందూపురంలో హాల్టింగ్ కల్పించింది. ప్రస్తుతం ఈ ట్రైన్ ఐదు స్టేషన్లలో ఆగుతుంది.
కాచిగూడ నుంచి ప్రారంభం అయిన తర్వాత మహబూబ్ నగర్, కర్నూలు సిటీ, అనంతపురం, ధర్మవరం స్టేషన్లో వందేభారత్ ట్రెయిన్కు ఇప్పటి వరకు హాల్టింగ్ ఉంది. ఇక నుంచి హిందూపురంలో కూడా ఆగనుంది. దీంతో హిందూపురం చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఎంతో మేలు జరగనుంది. బుధవారం మినహాయించి వారానికి ఆరు రోజులు ఈ రైలు రాకపోకలు సాగిస్తోంది. తెల్లవారు జామున 5:45 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరే వందేభారత్ ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 2 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. మధ్యాహ్నం 2:45 గంటలకు అక్కడి నుంచి తిరిగి ప్రారంభం అవుతుంది. రాత్రి 11 గంటలకు కాచిగూడకు వస్తుంది.