అక్షరటుడే, వెబ్డెస్క్ : GP Secretaries | రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు గుడ్ న్యూస్ చెప్పింది. వారి బిల్లుల చెల్లింపు కోసం రూ.104 కోట్ల నిధులను మంజూరు చేసింది.
రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం గత ఏడాది ఫిబ్రవరిలో ముగిసింది. దీంతో అప్పటి నుంచి పంచాయతీల ఆలనా పాలన జీపీ కార్యదర్శులే చూసుకుంటున్నారు. అయితే ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో కార్యదర్శులు సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి ఆయా గ్రామాల్లో పనులు చేయించారు. ఈ క్రమంలో పలువురు అప్పుల పాలు కూడా అయ్యారు. దీంతో వారు కొంతకాలంగా బిల్లులు విడుదల చేయాలని కోరుతున్నారు.
GP Secretaries | ఏకకాలంలో..
గతంలో ఎన్నాడు లేని విధంగా పంచాయతీ కార్యదర్శుల(Panchayat Secretaries) బిల్లుల కోసం ప్రభుత్వం రూ.104 కోట్లు విడుదల చేసింది. గతంలో చేసిన పనులకు సంబంధించి ఈ బిల్లులు మంజూరు అయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కార్యదర్శుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. నిధుల విడుదలపై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka)కు ధన్యవాదాలు తెలిపారు.
GP Secretaries | స్థానిక ఎన్నికల నేపథ్యంలో..
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు(Local Body Elections) షెడ్యూల్ విడుదలైంది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ఆలస్యం కావడంతో ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. మరోవైపు పంచాయతీలకు నిధులు లేక పాలన అస్తవ్యస్తంగా మారింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం తాజాగా నిధులు విడుదల చేసినట్లు తెలుస్తోంది.