అక్షరటుడే, వెబ్డెస్క్ : Funds Released | రాష్ట్రంలోని మున్సిపాలిటీ (Municipality)లకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. కొంతకాలంగా నిధుల లేమితో ఇబ్బందులు పడుతున్న బల్దియాలకు భారీ నజరానా ప్రకటించింది.
తెలంగాణలోని 138 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ప్రభుత్వం రూ.2,780 కోట్ల నిధులు విడుదల చేసింది. ఆయా బల్దియాల్లో 2,432 పనులకు ఆమోదం తెలిపింది. వెంటనే టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా ఏర్పాటు అయిన మున్సిపాలిటీలతో పాటు, బల్దియాల్లో వీలినమైన గ్రామాల్లో పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. తెలంగాణ రైజింగ్ విజన్ 2027లో భాగంగా హైదరాబాద్ (Hyderabad) నగరంతో పాటు అన్ని పట్టణాలను గ్రోత్ హబ్లుగా తీర్చిదిద్దాలని సీఎం నిర్ణయించారు. ఈ మేరకు తాజాగా నిధులు విడుదల చేశారు.
Funds Released | జనాభాకు అనుగుణంగా..
రాష్ట్రంలో పట్టణ జనాభా పెరుగుతోంది. ఈ క్రమంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యంగా కొత్తగా ఏర్పాటు అయిన మున్సిపాలిటీల్లో వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆయా పట్టణాల్లో కనీస సౌకర్యాలు సైతం కల్పించలేదు. పేరకు మున్సిపాలిటీలుగా ఏర్పాటు అయిన వసతులు లేకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.
Funds Released | చేపట్టనున్న పనులు ఇవే..
నగరాభివృద్ధి నిధులతో పాటు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ (UIDF) పథకాల నుంచి ప్రభుత్వం తాజాగా నిధులు విడుదల చేసింది. ఇందులో కొత్తగా ఏర్పాటైన బల్దియాలకు రూ.15 కోట్లు, అదనంగా గ్రామ పంచాయతీలు విలీనమైన బల్దియాలకు రూ. 20 కోట్లు, పాత మున్సిపాలిటీలకు రూ.15 కోట్ల చొప్పున కేటాయించనున్నారు. కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్లకు రూ.30 కోట్లు విడుదల చేశారు. ఆయా మున్సిపాలిటీల పరిధిలో అంతర్గత రోడ్లు, డ్రెయినేజీలు, కల్వర్టుల నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే పార్కులు అభివృద్ధి, షాపింగ్ కాంప్లెక్సుల నిర్మాణ పనులకు ఈ నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది.
