అక్షరటుడే, వెబ్డెస్క్ : Traffic Challans | వాహనదారులు నిబంధనలు పాటించకపోతే పోలీసులు జరిమానాలు వేస్తారు. హెల్మెట్ పెట్టుకోకున్నా.. రాంగ్సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, అతి వేగంగా వాహనాలు నడపడం తదితర కారణాలతో పోలీసులు చలాన్లు (Fines) వేస్తుంటారు. చలా నగరాలు, పట్టణాల్లో కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా కంట్రోల్ రూమ్ నుంచే నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానాలు వేస్తున్నారు.
పోలీసులు జరిమానాలు వేస్తున్నా.. చాలా మంది వాటిని చెల్లించడం లేదు. కొందరి వాహనాలపై వేల రూపాయల ఫైన్లు పేరుకుపోయాయి. ఇటీవల వరంగల్ (Warangal)లో పోలీసులు తనిఖీలు చేయగా.. ఓ స్కూటీపై ఏకంగా రూ.45 వేల విలువైన ఫైన్లు ఉన్నాయి. దీంతో పోలీసులు షాక్ అయ్యారు.
Traffic Challans | కర్ణాటకలో డిస్కౌంట్
వాహనదారులు జరిమానాలు చెల్లించేలా ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు స్పెషల్ డ్రైవ్లు చేపడుతాయి. గతంలో తెలంగాణ (Telangana)లో ప్రభుత్వం ట్రాఫిక్ చలాన్లపై భారీగా డిస్కౌంట్ ఇచ్చింది. తాజాగా కర్ణాటక ప్రభుత్వం (Karnataka Government) సైతం వాహనదారులకు ఊరట కలిగించే వార్త చెప్పింది. ట్రాఫిక్ జరిమానాలపై 50శాతం తగ్గింపు అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. పోలీసు శాఖ మొబైల్ ఈ-చలాన్లో నమోదైన పెండింగ్ కేసులకు జరిమానా మొత్తంలో 50 శాతం తగ్గింపును మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 12లోగా జరిమానాలు చెల్లించిన వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పష్టం చేసింది.
Traffic Challans | తెలంగాణలో సైతం ఇవ్వాలని..
తెలంగాణలో కూడా ట్రాఫిక్ జరిమానాలపై డిస్కౌంట్ ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. ఇటీవల పోలీసులు నిత్యం వాహనాల తనిఖీ (Vehicle Checks)లు చేపడుతుండటంతో చాలా మంది వాహనాలపై చలాన్లు పేరుకుపోయాయి. అయితే కాంగ్రెస్ అధికారంలో వచ్చిన కొత్తలో డిస్కౌంట్ ఇచ్చింది. ప్రస్తుతం మళ్లీ ఇవ్వకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
కాగా నిబంధనలు పాటించాలని జరిమానా వేస్తున్న ప్రభుత్వం డిస్కౌంట్ ఇవ్వడం సరికాదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. దీంతో వాహనదారుల్లో క్రమశిక్షణ దెబ్బతింటుందని పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఎలాగు డిస్కౌంట్ ఇస్తుందని చాలా మంది ఫైన్లు కట్టడం లేదు. రాయితీ ఇచ్చినప్పుడే కడతామని అలాగే ఉంటున్నారు.