అక్షరటుడే, వెబ్డెస్క్ : Farmers | వానాకాలం (Kharif) సీజన్లో సాగు అవుతున్న ధాన్యం సేకరణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సమాయత్తం అవుతోంది.
రాష్ట్రంలో వానాకాలంలో 62 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సన్నాలకు బోనస్ ఇస్తామని చెప్పడంతో ఇందులో 60శాతం సన్నరకాలనే సాగు చేశారు. ఈ సీజన్లో మొత్తం కోటిన్నర మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో కోటి టన్నులు కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Farmers | అక్టోబర్ 1 నుంచి..
రాష్ట్రంలో ప్రస్తుతం వరి పంట ఈనిక దశలో ఉంది. అయితే ముందస్తుగా సాగు చేసిన జిల్లాలో వరి పొలాలు 15 రోజుల్లో కోతకు రానున్నాయి. దీంతో ప్రభుత్వం ధాన్యం సేకరణ ప్రక్రియపై ఫోకస్ పెట్టింది. భారత ఆహార సంస్థ (FCI) మార్గదర్శకాల ప్రకారం.. అక్టోబర్ 1 నుంచి ధాన్యం సేకరణ (Paddy Buying) ప్రారంభించాలి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదేశాలు వచ్చాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 1 నుంచి ధాన్యం సేకరణ ప్రారంభించాలని యోచిస్తోంది. వీలైతే కొన్ని జిల్లాల్లో మూడు, నాలుగు రోజులు ముందుగానే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు.
Farmers | 8 వేల కొనుగోలు కేంద్రాలు
రాష్ట్ర వ్యాప్తంగా 8 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad), నల్గొండ (Nalgonda) జిల్లాల్లో ముందస్తుగా వరిసాగు చేస్తారు. ముఖ్యంగా బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల్లో ముందుగా సాగు చేస్తారు. దీంతో బాన్సువాడ, బోధన్, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో ఈ నెలాఖరులోగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. ధాన్యం సేకరణపై చర్చించేందుకు ఎఫ్సీఐ అధికారులు మంగళవారం హైదరాబాద్ వస్తున్నారు.
Farmers | బోనస్ ఇస్తారా..
కేంద్ర ప్రభుత్వం వానాకాలం సీజన్కు ధాన్యం మద్దతు ధరను ప్రకటించింది. ఏ గ్రేడ్కు రూ.2,389, బీ గ్రేడ్ ధాన్యానికి రూ.2,369 చెల్లించనున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం సన్నరకం ధాన్యం సాగును ప్రోత్సహించడానికి క్వింటాల్కు రూ.500 బోనస్ (Paddy Bonus) ఇస్తామని ప్రకటించింది. గత వానాకాలం సీజన్కు సంబంధించి రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ అయ్యాయి. యాసంగిలో సీజన్లో విక్రయించిన వారికి ఇప్పటి వరకు బోనస్ ఇవ్వలేదు. మరి వానాకాలం సీజన్లో సైతం బోనస్ ఇస్తారా లేదా చూడాల్సి ఉంది.