అక్షరటుడే, కామారెడ్డి: Goldsmiths | పసిడి ధరలు సామాన్యులను పరుగులు పెట్టిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ వేళ బంగారం దుకాణాల వైపు వెళ్లాలంటే జంకుతున్నారు. బంగారం కొనాలన్న ఆలోచన వదులుకునేలా బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
కామారెడ్డిలో బుధవారం రాత్రి వరకు తులం ధర రూ. 1,74,500 ఉన్న బంగారం.. గురువారం సాయంత్రానికి ఏకంగా రూ.11 వేలు పెరిగి రూ.1,85,500 కు చేరింది. తులం బంగారం ధర రూ. 2 లక్షలకు చేరడం ఎంతో దూరంలో లేదన్న చర్చ సాగుతోంది. ఒకప్పుడు పెళ్లిళ్ల సీజన్ వస్తే బంగారం దుకాణాలు కిటకిటలాడేవి. ప్రస్తుతం దుకాణాలు గిరాకీ లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. ఇక వెండి ధరలకు రెక్కలొచ్చాయి. గురువారం సాయంత్రం నాటికి బంగారంతో పాటు వెండి ధరలు పోటీపడ్డాయి. వెండి ధర రూ.4 లక్షలు దాటింది. దాంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
Goldsmiths | బ్యాంకుల వద్ద క్యూ
రోజురోజుకు బంగారం ధరలు పెరుగుతుండటంతో సాధారణ ప్రజలు అవాక్కవుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో అప్పులు ఇచ్చే వారు లేకపోవడంతో బంగారం ఉన్న వాళ్ళు బ్యాంకులలో రుణాలు తీసుకోవడానికి క్యూ కడుతున్నారు. బ్యాంకులో తక్కువ వడ్డీకి ఎక్కువ రుణం వస్తుండటంతో అనేక మంది గోల్డ్ లోన్ తీసుకోవడానికి ఎగబడుతున్నారు. దీంతో గోల్డ్ లోన్ తీసుకునే వారితో బ్యాంకులు కిటకిటలాడుతున్నాయి.
Goldsmiths | పూట గడవని పరిస్థితి..
అక్షరటుడే, ఇందూరు: బంగారం, వెండి ధరలు రోజులో పదిసార్లు పెరుగుతూ పోతుండటంతో అటు సామాన్య ప్రజలతోపాటు స్వర్ణ కార్మికులు కూడా ఆగం అవుతున్నారు. ముఖ్యంగా ఆభరణాలు తయారు చేసే కార్మికులు పనులు లేక వారి జీవనం అస్తవ్యస్తం అవుతోంది. ఇంటి అద్దె చెల్లించలేక, కుటుంబాన్ని నడిపించలేక విలవిల్లాడుతున్నారు. కనీసం కడుపు నిండా తిండిలేక పస్తులు ఉండే పరిస్థితి ఏర్పడుతోందని పలువురు కార్మికులు ‘అక్షరటుడే’తో వాపోతున్నారు. ముఖ్యంగా నిజామాబాద్తోపాటు, ఆర్మూర్లోని పలువురు స్వర్ణ కార్మికుల జీవనం దయనీయంగా మారింది.