అక్షరటుడే, వెబ్డెస్క్ : Kukatpally | హైదరాబాద్లోని కూకట్పల్లి ఈ నెల 18న సహస్ర అనే బాలిక హత్య జరిగిన విషయం తెలిసిందే. పదో తరగతి చదువుతున్న ఓ బాలుడు ఆమెను హత్య చేశాడు. ఈ కేసులో పోలీసులు బాలుడిని ఇప్పటికే అరెస్ట్ చేశారు.
శనివారం సీపీ మహంతి (CP Mahanti) కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. బాలుడు నెల క్రితమే ఇంట్లో చోరీకి ప్లాన్ చేశాడు. బ్యాట్ కోసమే బాలిక ఇంటికి వెళ్లానని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నిసార్లు అడిగినా డబ్బు గురించి చెప్పడం లేదన్నారు. బ్యాట్ తీసుకొని వెళ్తుండగా బాలిక అడ్డుకోవడంతో హత్య చేసి పారిపోయాడు. క్రైమ్ సిరీస్లు చూసే అలవాటు ఉన్న ఆ బాలుడు పోలీసులను తప్పుదారి పట్టించాడని సీపీ తెలిపారు. తమ విచారణలో బాలుడు నేరం ఒప్పుకున్నాడన్నారు. తనిఖీల్లో బాలుడి లేఖ, కత్తి దొరికిందని బాలానగర్ డీసీపీ సురేష్కుమార్(Balanagar DCP Suresh Kumar) వెల్లడించారు.
Kukatpally | అన్ని ఆధారాలు లభించాయి
సహస్రను ఆ బాలుడే హత్య చేసినట్లు అన్ని ఆధారాలు లభించాయని సీపీ అవినాష్ మహంతి తెలిపారు. దొంగతనానికి సంబంధించిన మొత్తం ప్లాన్ను ఓ పేపర్లో రాసుకున్నట్లు చెప్పారు. క్రికెట్ బ్యాట్ (Cricket Bat) విషయంలో నిందితుడు గతంలో సహస్ర తమ్ముడితో గొడవ పడ్డాడన్నారు. ఈ క్రమంలో బ్యాట్ చోరీ చేయడానికి వచ్చి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. యూట్యూబ్లో క్రైమ్ సీన్స్ చూసి హత్య ఎలా చేయాలో నేర్చుకున్నట్లు పేర్కొన్నారు. హత్య చేసిన తర్వాత ఆధారాలు మాయం చేయడం సైతం నేర్చుకోవడం గమనార్హం. విచారణ సమయంలో క్రిమినల్ ఇంటెలిజెన్స్గా వ్యవహరించిన బాలుడు పోలీసులను సైతం తప్పుదోవ పట్టించాడు.
Kukatpally | కఠినంగా శిక్షించాలి
తన కూతురికి జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదని సహస్ర తండ్రి అన్నారు. తన బిడ్డను చంపిన వాడిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. తన కుమారుడితో క్రికెట్ ఆడడానికి వచ్చే ఆ బాలుడికి ఇంత క్రిమినల్ మైండ్ ఉందని ఊహించలేదన్నారు. ఇంత దారుణం తర్వాత కూడా తమ ఇంటికి వచ్చాడంటే, ఎంత క్రూరమైన ఆలోచన ఉందో అర్థం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.