Jubilee Hills
Jubilee Hills | కవితతో భేటీ అయిన కాంగ్రెస్​ మాజీ ఎమ్మెల్సీ.. జూబ్లీహిల్స్​లో పోటీ కోసమేనా!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jubilee Hills | జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha)తో కాంగ్రెస్​ మాజీ ఎమ్మెల్సీ అమీర్​ అలీ ఖాన్ (Aamir Ali Khan)​ గురువారం భేటీ అయ్యారు. రెండు గంటల పాటు ఆమెతో చర్చలు జరిపారు.

బీఆర్​ఎస్​ (BRS) నుంచి సస్పెండ్​ అయిన కవిత సొంతంగా పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమె జాగృతి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల్లో ఆమె ఎవరికి మద్దతు ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న పలువురు ఆమెను కలుస్తున్నట్లు తెలుస్తోంది.

Jubilee Hills | సుప్రీంకోర్టు రద్దు చేయడంతో..

కాంగ్రెస్​ మాజీ ఎమ్మెల్సీ అమీర్​ అలీ ఖాన్​ గురువారం కవితతో భేటీ అయ్యారు. ఆయనను గతంలో కాంగ్రెస్​ ఎమ్మెల్సీగా చేసింది. అయితే ఆయనతో పాటు కోదండరాం నియామకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. అనంతరం కోదండరామ్​కు మరోసారి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్​ అమీర్​ అలీఖాన్​ను మాత్రం పక్కన పెట్టింది. ఆయన స్థానంలో మాజీ ఎంపీ అజారుద్దీన్​ (Azharuddin)ను ఎమ్మెల్సీ చేసింది. దీంతో అలీఖాన్​ జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కవితతో భేటీ అయ్యారనే వార్తలు వస్తున్నాయి.

కాగా జూబ్లీహిల్స్​ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పీజేఆర్​ కుమారుడు విష్ణువర్ధన్​రెడ్డి (Vishnuvardhan Reddy) సైతం ఇటీవల కవితను కలిశారు. అయితే తాను పెద్దమ్మ ఆలయాల్లో ఉత్సవాలకు ఆహ్వానించడానికే కవితను కలిసినట్లు ఆయన చెప్పారు. తాను కేటీఆర్​ వెంటే ఉంటానని ప్రకటించారు.

జూబ్లీహిల్స్​లో గెలుపు కోసం కాంగ్రెస్​, బీజేపీ, బీఆర్​ఎస్​ ఇప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎలాగైన ఆ స్థానాన్ని గెలుచుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో కవిత ఎంట్రీతో ఆసక్తి నెలకొంది. ఆమె ఎవరికి మద్దతు ఇస్తారని రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. సిట్టింగ్​ స్థానం కోసం బీఆర్​ఎస్​ ప్రయత్నిస్తుండగా.. కవిత అభ్యర్థిని బరిలోకి దింపితే గులాబీ పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.