అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్కు (SRSP) ఎగువ నుంచి వరద తగ్గింది. ప్రస్తుతం జలాశయంలోకి 1.50 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది.
రాష్ట్రంలో, ఎగువన కురిసిన వర్షాలతో ప్రాజెక్ట్లోకి మొన్నటి వరకు ఐదు లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద తగ్గింది. దీంతో అధికారులు దిగువకు నీటి విడుదలను తగ్గించారు. ప్రస్తుతం ప్రాజెక్ట్లోకి 1.50 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1089.9 అడుగుల (76.49 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.
Sriram Sagar | కాల్వల ద్వారా నీటి విడుదల
ప్రాజెక్ట్ నిండుకుండలా ఉండడంతో పాటు ఎగువ నుంచి వరద కొనసాగుతుండడంతో అధికారులు 29 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. వరద గేట్ల (Flood Gates) ద్వారా 1.25 లక్షల క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 3,500, వరద కాలువకు 18 వేలు, కాకతీయ కాలువ (Kakatiya Canal)కు 4,500 క్యూసెక్కులు వదులుతున్నారు. మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 666 క్యూసెక్కుల నీరు పోతోంది. వర్షాల నేపథ్యంలో సరస్వతి, లక్ష్మి కాలువతో పాటు అలీసాగర్, గుత్ప ఎత్తిపోతలకు నీటి విడుదలను నిలిపి వేశారు.
Sriram Sagar | నిండుకుండలా మిడ్మానేరు
వరద కాలువ ద్వారా మిడ్మానేరు (Mid Manair)కు నిత్యం 18 వేల క్యూసెక్కులు తరలిస్తున్నారు. మానేరు వాగు ద్వారా కూడా జలాశయంలోకి నీరు వస్తోంది. దీంతో ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వతో నిండుకుండలా మారింది. ప్రాజెక్ట్ నుంచి అనంతగిరి 12,800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
Sriram Sagar | అప్రమత్తంగా ఉండాలి
ప్రాజెక్ట్ వరద గేట్లు, కాల్వల ద్వారా నీటి విడుదల కొనసాగుతుండడంతో పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్ట్ ఏఈఈ కొత్త రవి సూచించారు. గోదావరిలోకి నీటి విడుదల పెరిగే అవకాశం ఉందని, ఎట్టి పరిస్థితుల్లో నదిలో చేపల వేటకు వెళ్లొద్దన్నారు. పశువుల కాపర్లు, రైతులు సైతం నదీ సమీపంలోకి వెళ్లొద్దని ఆయన హెచ్చరించారు.