అక్షరటుడే, బాల్కొండ : Sriram Sagar | ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరామ్సాగర్ ప్రాజెక్ట్(SRSP)కు ఎగువ నుంచి వరద పెరిగింది. దీంతో అధికారులు 22 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు.
స్థానికంగా కురిసిన వర్షాలతో జలాశయంలోకి ఇన్ఫ్లో కొనసాగుతోంది. నిజాంసాగర్ (Nizam Sagar) గేట్లు ఎత్తడంతో ఆ నీరు ఎస్సారెస్పీలోకి చేరుతోంది. దీంతో జలాశయంలోకి ప్రస్తుతం 82,395 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది.
Sriram Sagar | నిండుకుండలా జలాశయం
ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1091 (80.5 టీఎంసీలు) అడుగులు కాగా.. అంతే మొత్తం నీటితో కళకళలాడుతోంది. వరద పెరగడంతో అధికారులు శుక్రవారం రాత్రి నుంచి 22 గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు.
Sriram Sagar | నీటి విడుదల వివరాలు
ప్రాజెక్ట్లోకి ఎగువ నుంచి ఇన్ఫ్లో కొనసాగుతుండటంతో 22 గేట్ల (Flood Gates) ద్వారా 64,680 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఎస్కేప్ గేట్ల ద్వారా 8 వేల క్యూసెక్కులు, వరద కాలువకు 8 వేలు, సరస్వతి కాలువ ద్వారా 800, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు వదులుతున్నారు. ఆవిరి రూపంలో 684 క్యూసెక్కులు పోతోంది. దీంతో మొత్తం ఔట్ ఫ్లో 82,395 క్యూసెక్కులుగా ఉంది.
ఇన్ఫ్లో, ఔట్ఫ్లో సమానంగా ఉండటంతో ప్రాజెక్ట్ నీటిమట్టం నిలకడగా ఉంది. వర్షాలు పడుతుండటంతో కాకతీయ కాలువ, లక్ష్మి కాలువ, అలీసాగర్, గుత్ప ఎత్తిపోతలలకు నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు. వరద గేట్లు, కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతుండటంతో పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.