అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | రాష్ట్రవ్యాప్తంగా నాలుగైదు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ (North Telangana)లో భారీ వర్షాలు పడుతున్నాయి. నిజామాబాద్(Nizamabad), నిర్మల్ (Nirmal) జిల్లాల్లో కురిసిన వర్షానికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్కు స్వల్పంగా ఇన్ఫ్లో పెరిగింది. నిన్నటి వరకు రెండు వేల నుంచి మూడు వేల క్యూసెక్కుల వరద రాగా.. శనివారం ఉదయానికి 4,500 క్యూసెక్కులకు పెరిగింది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ ప్రధాన కాలువకు 100 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231కు వదులుతున్నారు.
ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా శనివారం ఉదయం 9 గంటల వరకు ప్రాజెక్ట్లో 1069.1 అడుగుల (21.882 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. కాగా గతేడాది ఇదే సమయానికి జలాశయంలో 27.579 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
Sriram Sagar | మహారాష్ట్రలో వర్షాలు పడితేనే..
ఎగువన మహారాష్ట్రలో గోదావరి (Godavari) నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను అధికారులు జులై 1న ఎత్తారు. అయితే ఎగువన వర్షాలు లేకపోవడంతో వరద రావడం లేదు. స్థానికంగా కురుస్తున్న వానలతోనే స్వల్ప ఇన్ఫ్లో నమోదవుతోంది. మహారాష్ట్రలో భారీ వర్షాలు పడితేనే ప్రాజెక్ట్లోకి భారీ వరద రానుంది. ఏటా ఆగస్టులో ప్రాజెక్ట్లోకి భారీగా ఇన్ఫ్లో వస్తుంది. దీంతో ఈ ఏడాది కూడా ఆగస్టులోనే ప్రాజెక్ట్ నిండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ప్రాజెక్ట్ నిండితే వరద గేట్లను ఎత్తి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ (Yellampalli Project)కు నీటిని వదులుతారు. అలాగే వరద కాలువ ద్వారా మిడ్మానేరు (Mid Maneru), లోయర్ మానేర్ డ్యామ్ (LMD)లకు నీటిని తరలిస్తారు. ప్రస్తుతం ఎగువన గోదావరికి వరద లేకపోవడంతో ఎస్సారెస్పీతో పాటు ఎల్లంపల్లి, మిడ్మానేరు, లోయర్ మానేర్ ప్రాజెక్ట్లు నీరు లేక బోసిపోతున్నాయి. మరోవైపు దిగువన కాళేశ్వరం వద్ద మాత్రం గోదావరి ఉధృతంగా పారుతోంది. లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలు అవుతోంది.