అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | ఉత్తర తెలంగాణ జిల్లాల వర ప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ (SRSP)కు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. స్థానికంగా కురుస్తున్న వర్షాలతో పాటు మహారాష్ట్ర నుంచి గోదావరికి వరద వస్తోంది. దీంతో జలాశయంలోకి ప్రస్తుతం 28,147 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 (80.5 టీఎంసీలు) అడుగులు కాగా.. ప్రస్తుతం 1078.80 (41.907 టీఎంసీలు) అడుగులకు నీరు చేరింది. గతేడాది ఇదే సమయనికి ప్రాజెక్టులో 47.250 టీఎంసీల నీరు ఉంది.
Sriram Sagar | కొనసాగుతున్న నీటి విడుదల
ప్రాజెక్ట్ (Project) నుంచి ఆయకట్టుకు నీటి విడుదల కొనసాగుతోంది. ఆగస్టు 7న కాలువల (Canals) ద్వారా నీటి విడుదలను ప్రారంభించారు. ఎస్పారెస్పీ కింద ఉన్న ఆరు లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రస్తుతం నీటిని వదులుతున్నారు. కాకతీయ కాలువ ద్వారా 3వేల క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 3వేల క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు, లక్ష్మీ కాల్వ ద్వారా 150 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 300 క్యూసెక్కులు, అలీ సాగర్ ఎత్తిపోతలకు 180 క్యూసెక్కులు, గుత్ప ఎత్తిపోతలకు 270 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
కాలువల ద్వారా నీటిని వదులుతుండటంతో ఆయకట్టు రైతులు (Farmers) హర్షం వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ 20 వరకు ఆయకట్టుకు నీటిని విడుదల చేయనున్నారు. కాకతీయ కాలువ పరిధిలోని జోన్ -1 ఏడు రోజులు, జోన్- 2 కు 8 రోజులపాటు వారాబంధీ ప్రకారం నీటిని అందించనున్నారు. మిగిలిన కాలువలకు ఏడు రోజుల ఆన్ ఆఫ్ పద్ధతిలో నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కొత్త రవి తెలిపారు.