అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరామ్సాగర్ (SRSP)కు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. దీంతో అధికారులు 8 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్ట్లోకి 54,545 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. దీంతో అధికారులు ఎనిమిది వరద గేట్లు ఎత్తి 25 వేల క్యూసెక్కులు గోదావరి (Godavari)లోకి వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1091 (80.5 టీఎంసీలు) అడుగులు కాగా.. ప్రస్తుతం అంతేమొత్తంలో నీరు నిల్వ ఉంది.
Sriram Sagar | కాలువల ద్వారా నీటి విడుదల
జలాశయం నుంచి 19 వేల క్యూసెక్కులు వరద కాలువ (Flood Canal)కు విడుదల చేస్తున్నారు. కాకతీయ కాలువకు 5,500 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 2,500, సరస్వతి కాలువకు 800, లక్ష్మి కాలువకు 360 క్యూసెక్యుల నీటిని వదులుతున్నారు. అలీసాగర్ ఎత్తిపోతలకు 360, గుత్ప ఎత్తిపోతలకు 270, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మొత్తం 54,545 క్యూసెక్కుల ఔట్ ఫ్లో నమోదు అవుతోంది.
శ్రీరామ్ సాగర్ మిగులు జలాలను సద్వినియోగం చేసుకోవడం కోసం నిర్మించిన వరద కాలువ ద్వారా మిడ్మానేరు (Mid Manair)కు నీటిని తరలిస్తున్నారు. ఇప్పటికే మిడ్ మానేరు నిండుకుండలా మారాగా.. అక్కడి నుంచి లోయర్ మానేరుకు నీటిని వదులుతున్నారు. ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతలతో మిడ్మానేరు, లోయర్ మానేరు డ్యాంలను నింపితే విద్యుత్ బిల్లు రూ.కోట్లలో వచ్చేది. ఈ సీజన్లో ఎస్సారెస్పీకి వరదలు భారీగా రావడంతో వరద కాలువ ద్వారా ఆ ప్రాజెక్ట్లను అధికారులు నింపారు.
Sriram Sagar | అప్రమత్తంగా ఉండాలి
శ్రీరామ్సాగర్ ప్రాజెక్ట్ నుంచి గోదావరి, కాలువలకు నీటి విడుదల కొనసాగుతుండంతో పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పశువుల కాపర్లు, మత్స్యకారులు కాలువలు, నదిలోకి వెళ్లొద్దని ప్రాజెక్ట్ ఏఈఈ కొత్త రవి సూచించారు. ఎగువ నుంచి వరద పెరిగితే గోదావరిలోకి నీటి విడుదలను పెంచుతామన్నారు.