అక్షరటుడే, బాన్సువాడ: Flag march | కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను జిల్లా పోలీస్ శాఖ తక్షణమే అదుపులోకి తీసుకువచ్చింది.
సంఘటన జరిగిన వెంటనే అదనపు బలగాలను మోహరించి, కేవలం మూడు గంటల్లోనే పరిస్థితిని పూర్తిగా నియంత్రించడంలో పోలీసులు విజయవంతమయ్యారు. ప్రస్తుతం పట్టణంలో పరిస్థితి పూర్తిగా యథాస్థితికి చేరుకుంది.
సీసీటీవీ ఫుటేజీ, సోషల్ మీడియా ద్వారా లభించిన ఆధారాల ప్రకారం మొత్తం 42 మంది వ్యక్తులను గుర్తించగా, ఇప్పటివరకు 19 మంది నిందితులను అరెస్టు చేశారు. మిగతా వ్యక్తులను కూడా త్వరలోనే గుర్తిస్తామని పోలీసులు వెల్లడించారు. సదరు ఘటనలో పాల్గొన్న వారందరిపై కమ్యూనల్ సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేస్తామని, భవిష్యత్తులో వారిపై కఠిన నిఘా కొనసాగించబడుతుందన్నారు.
Flag march | చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు..
ప్రజల్లో భద్రతాభావాన్ని మరింత బలోపేతం చేయడం, శాంతిభద్రతల పట్ల విశ్వాసాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో బాన్సువాడ పట్టణంలో భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ ఫ్లాగ్ మార్చ్ పోలీస్ స్టేషన్ వద్ద ప్రారంభమై ఓల్డ్ వీక్లీ మార్కెట్, గోల్డ్ షాప్ ప్రాంతం, జెండా గల్లి, ఓల్డ్ షేక్ చాంద్ హోటల్, మున్సిపల్ ఆఫీస్ ప్రాంతం మీదుగా ఇస్లాంపూర్, గౌలిగూడ, హనుమాన్ టెంపుల్, హర్పత్ కాలనీ, రిలయన్స్, రిలయన్స్ స్మార్ట్ ఏరియా, తాడ్కోల్ చౌరస్తా, బస్టాండ్ ప్రాంతాల మీదుగా తిరిగి పోలీస్ స్టేషన్ వరకు కొనసాగింది.
ఫ్లాగ్ మార్చ్లో సుమారు 120 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో సుమారు 6 కిలోమీటర్ల మేర పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ..
బాన్సువాడలో జరిగిన సంఘటనకు సంబంధించి చట్ట విరుద్ధంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరినీ గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
బాన్సువాడ పట్టణంలో బలవంతపు బంద్కు పాల్పడిన వారిపై ఇప్పటికే కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సోషల్ మీడియా వేదికల ద్వారా సమాజంలో అశాంతి సృష్టించే విధంగా తప్పుడు, ప్రేరేపిత లేదా రెచ్చగొట్టే సమాచారాన్ని ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
చట్టాన్ని చేతిలోకి తీసుకునే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా అసత్య ప్రచారాలు చేయడం, వదంతులు వ్యాప్తి చేయడం తీవ్రమైన నేరమని స్పష్టం చేశారు. వాట్సాప్ వంటి వేదికలలో ప్రసారం అవుతున్న అసత్య సమాచారాన్ని గ్రూప్ నిర్వాహకులు వెంటనే తొలగించాలని, తప్పుడు సమాచారాన్ని పంపిన వారిని కూడా నేరానికి పాల్పడిన వారిగానే పరిగణించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ ఘటనకు సంబంధించి నిజామాబాద్, నస్రుల్లాబాద్, సంగారెడ్డి ప్రాంతాల్లో ఎఫ్ఐఆర్లు నమోదు అయినట్లు తెలిపారు. అన్ని కేసులలో కూడా విచారణ వేగవంతంగా కొనసాగుతోందన్నారు. పట్టణంలో శాంతి, సామరస్యాలను కాపాడటం ప్రతి పౌరుడి సామూహిక బాధ్యతగా చెప్పారు.
ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మకుండా పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని ఎస్పీ కోరారు. ఆస్తి నష్టం జరిగిన బాధితులు నిర్భయంగా ముందుకు వచ్చి ఫిర్యాదులు నమోదు చేయాలని సూచించారు.
అందిన ప్రతి ఫిర్యాదును సమగ్రంగా పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. పరిస్థితి సాధారణ స్థితికి రావడానికి సహకరించిన ప్రజలందరికీ జిల్లా పోలీస్ శాఖ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమంలో బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు, ఎస్హెచ్వో శ్రీధర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ రవి, రూరల్ ఇన్స్పెక్టర్ తిరుపయ్య, ఇతర ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, ఆర్ఎస్ఐలు, పోలీసులు పాల్గొన్నారు.
